ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. అమృత్పాల్ సింగ్ ఎక్కడ ఉన్నాడు? అన్నది ఇంకా అంతు చిక్కలేదు. ఈ క్రమంలో అమృత్పాల్ సింగ్ భార్య కిరణ్దీప్ కౌర్ గురువారం లండన్కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్సర్ ఎయిర్పోర్టులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లండన్ వెళ్లే విమానం మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. పరారీలో ఉన్న అమృత్పాల్ సింగ్ భార్య కిరణ్దీప్ కౌర్ను అమృత్సర్ విమానాశ్రయంలో నిలిపివేసి విచారిస్తున్నట్లు పంజాబ్ పోలీసు వర్గాలు తెలిపాయి. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. ఆమెను ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రశ్నిస్తోంది.
Also Read: CM Jagan Mohan Reddy:మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై జగన్ సమీక్ష
అమృత్పాల్ సన్నిహితులు, బంధువులు దేశం విడిచి వెళ్లరాదని ఇప్పటికే సర్క్యులర్ జారీ అయింది. దీంతో అమృతపాల్ భార్య లండన్ వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్దీప్ కౌర్ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. అమృతపాల్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్కు చెందిన ఎన్ఆర్ఐ కౌర్ను వివాహం చేసుకున్నాడు. తన భార్యతో కలిసి పంజాబ్లో నివసిస్తానని అమృతపాల్ ప్రకటించాడు. మార్చిలో, అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ప్రశ్నించారు. అమృతపాల్తో వివాహం జరిగిన తర్వాత,కిరణ్దీప్ కౌర్ పంజాబ్కు వెళ్లి ఇప్పుడు అమృతపాల్ పూర్వీకుల గ్రామమైన జల్లుపూర్ ఖేడాలో నివసిస్తున్నారు. కిరణ్దీప్ కుటుంబ మూలాలు జలంధర్లో ఉన్నాయని చెబుతున్నారు.
Also Read: IPL 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
అమృతపాల్ పరారీ తర్వాత కిరణ్దీప్ కౌర్ను కూడా ముందుగా విచారించారు. కిరణ్దీప్ కౌర్ అమృత్పాల్తో టచ్లో లేరని పోలీసుల విచారణలో గతంలో చెప్పారు. అలాగే కిరణ్దీప్కి యూకే పౌరసత్వం ఉండటంతో ఆమె లండన్ వెళ్తుందా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. కిరణ్దీప్ కౌర్ బ్రిటీష్ పౌరురాలు కావడంతో ఆమె పాస్పోర్టు భారత్లో చెల్లుబాటు అయ్యేది. పాస్పోర్ట్లో ఆమె ఎంతకాలం భారత్లో ఉండి ఉండవచ్చనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.