NTV Telugu Site icon

5వ రోజు : కోటి దీపోత్సవంలో.. శివకేశవుల కల్యాణం అంగరంగ వైభవం..

శివకేశవులు ఇద్దరు కాదు.. ఒక్కటే అనే దానికి నిదర్శనం ఈ రోజు కోటి దీపోత్సవంలో జరిగి కళ్యాణమహోత్సవమే. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీతులసీదామోదర కళ్యాణంతో పాటు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ-గంగ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం కన్నులపండువగా సాగింది. కోటి దీపోత్సవ వేదికపైన ఉన్న సాంబయ్యను పెళ్లిచేసుకునేందుకు కదిలి వచ్చిన బెజవాడ దుర్గమ్మ కు జేజేలు అంటూ భక్తులను ఉద్దేశించి అర్చకులు వేదమంత్రోత్చరణల నడుమ స్వామి వార్ల కళ్యాణం జరిపించారు.

ముందుకు వైంకుఠాధీశుడు శ్రీతులసీదామోదర కళ్యాణం కమనీయంగా నిర్వహించన వేద పండితులు అనంతరం కనకదుర్గ-గంగ సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణ ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కోటి దీపోత్సవ వేదిక అర్థనారీశ్వరుడిని దర్శనిచ్చినట్టుగా.. ఓ వైపు విష్ణు రూపాన్ని మరో వైపు శివ రూపాన్ని దర్శనమిచ్చింది. ఈ సన్నివేశాన్ని చూసిన భక్తకోటి శివకేశవులకు జేజేలు పలికారు. అంతేకాకుండా కనకదుర్గమ్మకు అర్చన అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం శివకేశవుల పల్లకి సేవలు భక్తులను ఆశీర్వదించేందుకు వేదిక ప్రాంగణం చుట్టూ తిరిగాయి.

భక్తితో నిండిన హృదయాలతో ఆ నిత్య కళ్యాణ దంపతులకు భక్తులు నీరాజనం పట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు మహాదీపార్చనతో ముఖ్యమైన దీపోత్సవ ఘట్టం మొదలైంది. శివనామస్మరణలతో యావత్తు వేదిక ప్రాంగణం మార్మోగింది. అధ్యాత్మిక డోలికల్లో భక్తజనం కోటి దీపార్చన నిర్వహించారు. ఇక లింగోద్భవ ఘట్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బంగారు లింగోద్భవం సన్నివేశాన్ని కన్నులారా చూసి తరించడమే తప్పా చెప్పడం వీలుకాదు..

అనంతరం నిర్వహించిన సప్తహారతి ఈ కార్యక్రమానికి మరింత శోభను తీసుకువచ్చింది. మంగళవాయిద్యాలు, నృత్యాలతో శోభయమానంగా మారింది. చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తితో కార్తీకమాసాన కోటి దీపోత్సవ వేడుకల్లో పాల్గొని పునీతులయ్యారనే చెప్పాలి..