ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి బెడద 2 సంవత్సరాల నుంచి పోవడం లేదు. కరోనా కట్టడికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని తలచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం టీకాఉత్సవ్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 130 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.
అయితే తాజాగా తెలంగాణలో 100 శాతం తొలి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ పూర్తైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా 61 శాతం మందికి రెండు డోస్లు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. గ్రామాల నుంచి నగరాల వరకు వైద్య సిబ్బంది ఎంతో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని, వారి కృషి తోనే వ్యాక్సిన్ పంపిణీ ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
