NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పిఠాపురంలో దారుణం.. మైనర్‌ బాలికకు మద్యం తాగించి అత్యాచారం.. ఆపై..!
కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణమైన ఘటన జరిగింది.. ఇందిరానగర్ లో మైనర్‌ బాలికకు మద్యం పట్టించి.. ఆపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.. నిందితుడిగా పేర్కొంటున్న మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.. జాన్ బాబుకు మరో మహిళ సహకరించినట్లుగా తెలుస్తుంది.. బలవంతంగా ఆటో ఎక్కించి డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లు చెబుతున్నారు మైనర్ బాలిక బంధువులు.. మరోవైపు.. అపస్మారక స్థితిలో ఉన్న బాలిక ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది, పోలీసుల అదుపులో జాన్ బాబుతో పాటు మరో మహిళ ఉన్నారు.. పోలీసుల విచారణలో ఇద్దరూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారట.. జాన్ బాబు ఆటో ఎందుకు ఎక్కించుకున్నావంటే.. మామూలుగానే ఎక్కించుకున్నాను.. మీరు ఏం చేసినా పర్వాలేదని సమాధానం చెబుతున్నట్టుగా తెలుస్తోంది..

హస్తినలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. నేడు కీలక భేటీలు
తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగింది. తొలుత ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర హోంశాఖ కీలక సమావేశానికి హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమై… పలు కీలక అంశాలపై చర్చించారు.తెలంగాణకు వరద నష్టం సాయం పెంచాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ భేటీలో మూసీ ప్రక్షాళన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధానికి కృతజ్ఞతలు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. రెండోరోజు పర్యటనలోభాగంగా ఇవాళ పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. అమిత్‌షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, పీయూష్ గోయల్, హార్దీప్‌ సింగ్ పూరితో భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్న ఏపీ సీఎం.. సాయంత్రం 4.30కి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అవుతారు.. ఇక, 5:45కి కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీకానున్నారు.. రాత్రి 8 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశంకానున్నారు.. రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు..

బీజేపీ నేత వాకాటిని బెంబేలెత్తించిన నకిలీ సీబీఐ.. రూ.15 కోట్లు డిమాండ్‌..
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డిని నకిలీ సీబీఐ అధికారులు బెంబేలెత్తించారు. ముంబైలోని సీబీఐ అధికారులుగా చెబుతూ 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఇదివరకే వాకాటిపై సీబీఐ కేసులు ఉండటంతో ఆయనకు కొంత అవగాహన ఉంది. దీంతో ఆయన గట్టిగా సమాధానం చెప్పినప్పటికీ.. వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. థాయిలాండ్‌కు పంపిన పార్సెల్‌లో మాదకద్రవ్యాలు.. విదేశీ కరెన్సీ దొరికాయని.. మీ ఆధార్ కార్డు వివరాలతోనే ఈ పార్సెల్ వెళ్లిందని చెప్పారు. తాను ఎలాంటి పార్సెల్ పంపలేదని నారాయణరెడ్డి చెప్పడంతో ఈ విషయాన్ని ముంబైలోని సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకాక ముంబై సెంట్రల్ క్రైమ్ అధికారులతో మాట్లాడాలని నకిలీ కేటుగాళ్లు వాట్సాప్‌ కాల్‌లో చెప్పారు. తాను నిజంగానే అధికారులతో మాట్లాడుతున్నట్టు భావించిన నారాయణరెడ్డి తనకు వచ్చిన కాల్స్ వివరాలను వారికి తెలిపారు. వాట్సాప్ కాల్ ద్వారా నారాయణ రెడ్డి వివరాలను తీసుకున్నారు. ఆధార్ కార్డుతో పాటు.. మరిన్ని వివరాలను సేకరించిన నకిలీ అధికారులు.. మనీలాండరింగ్ కేసు ఉందని చెప్పారు. తనపై ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన కేసులు కోర్టులో నడుస్తున్నాయని వాకాటి సమాధానం చెప్పినా.. తాము పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతవరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని నాలుగు రోజులపాటు నిఘా పేరుతో వాకాటిని సెల్ఫ్ కస్టడీలో ఉంచారు.

సింగూరుకు మంజీరా పరవళ్లు.. రాజగోపురంలోనే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు..
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాదేవి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ వనదుర్గా భవాని కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి నీలి రంగు వస్త్రంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి వరద వస్తుండటంతో ఆలయం వద్ద మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఏడు రోజులుగా ఏడు పాయల ఆలయం జలదిగ్బంధంలో ఉండటంతో, అర్చకులు రాజగోపురంలోనే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో మూలవిరాట్ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాజగోపురంలో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక.. మూలవిరాట్ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లేకుండా పోయిందేనని భక్తులు నిరాస వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆలయ ప్రాంగణంలోని గోకుల్ షెడ్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు కొనసాగిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు.

జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేసుకుంటారా? సీఎం రేవంత్‌కు బండి సంజయ్‌ లేఖ
జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేసుకుంటారా? అంటూ సీఎం రేవంత్‌ రెడ్డికు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్‌ జర్నలిస్టులకు మంజూరు చేసిన ఇండ్ల పట్టాలను రద్దు చేయడం పై ఆయన మండిపడ్డారు. జర్నలిస్టులు పడుతున్న కష్టాలపై లేఖలో పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ముందర కరీంనగర్ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మీ ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమైన విషయం. అన్ని పథకాల్లో మహిళలలే మీరు ప్రాధాన్యత `ఇస్తానని.. ‘మహాలక్ష్మి’ పథకం అందిస్తానని… ఇంటి యజమానురాలుగా మహిళనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. సీఎం సోడాలో మీరు, మీ మంత్రివర్గ సహచరులు సైతం ఇదే విషయాన్ని పదేపదే చెప్పారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణలో అతి పెద్ద పండుగైన విజయదశమి ముందర మహా ఇష్టమైన బతుకమ్మ పండుగ ముంగిట జర్నలిస్టు కుటుంబ సభ్యులైన మహిళల పేరిట ఇచ్చిన ఇంద్ర స్థలాలను రద్దు వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడం ఎంతవరకు సమంజసం?

భూగర్భంలో అణు పరీక్షలు చేస్తున్న ఇరాన్..? ఇజ్రాయెల్పై దాడికి ప్లాన్..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్‌ మరింత పెంచుతుంది. అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు చేసినట్లు సమాచారం. అక్టోబర్‌ 5వ తేదీన శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్‌ భూభాగాల్లో దాదాపుగా ఒకే టైంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు దారి తీసింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:45 సమయంలో ఇరాన్‌లోని అరదాన్‌ నగర సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదు అయింది. అయితే, అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో కూడా ప్రకంపనలు సంభవించినట్లు అమెరికా భౌతిక సర్వే విభాగం వెల్లడించింది. తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్‌లోనూ భూ ప్రకంపనలు కనిపించాయని పేర్కొనింది. ఇది భూకంపం కాదని, ఖచ్చితంగా భూగర్భ అణు పరీక్షల చేసినట్లు విశ్లేషణలు అంటున్నారు. ఈ భూకంపం సంభవించింది అణు ప్లాంట్‌కు అతి సమీపంలోనే అని వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కిలో మీటర్ల లోపల ఉండటం చూస్తుంటే ఇరాన్ భూగర్భ అణు పరీక్షలు చేసి ఉంటుందని అనుమానం కలుగుతుంది. ఇజ్రాయెల్ దూకుడుకు బ్రేక్ వేసేందుకే ఇరాన్ న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నట్లు సమాచారం.

మరోసారి తలపడనున్న భారత్, పాకిస్తాన్.. ఎప్పుడు, ఎక్కడంటే?
దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు ఈ ఏడాదిలో మరోసారి తలపడనున్నాయి. జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2024లో పురుషుల జట్టు తలపడగా.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో మహిళల టీమ్స్ తలపడ్డాయి. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో దాయాది జట్లు మరోసారి ఢీకొట్టనున్నాయి. అక్టోబర్ 19న ఇండియా ఎ, పాకిస్థాన్ ఎ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మస్కట్‌లోని ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానంలో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024కు సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 18 నుంచి ఒమన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 27న జరుగుతుంది. టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎలో శ్రీలంక ఎ, బంగ్లాదేశ్ ఎ, ఆఫ్ఘనిస్తాన్ ఎ, హాంకాంగ్ టీమ్స్ ఉన్నాయి. గ్రూప్‌-బిలో భారత్‌ ఎ, పాకిస్థాన్‌ ఎ, యుఎఇ, ఒమన్‌ జట్లు ఉన్నాయి. హాంకాంగ్, యూఏఈ, ఒమన్ ప్రధాన జట్లే టోర్నీలో ఆడనున్నాయి. ఆసియా కప్ 2024 టోర్నీలో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకు.. రెండో మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ఆరంభం అవుతాయి. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. 2013లో ఆరంభమైన ఈ టోర్నీ ఇప్పటి వరకు ఐదుసార్లు జరిగింది. పాకిస్థాన్, శ్రీలంకలు రెండుసార్లు గెలుపొందగా.. భారత్ ఒకసారి విజేతగా నిలిచింది. గత రెండుసార్లు పాక్ విజేతగా నిలిచింది. గతంలో అండర్-23 ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడేవారు. గత ఎడిషన్ నుంచి ఎ జట్ల టోర్నీగా మార్చారు.

అఖండ 2లో బాలయ్య డైలాగ్స్ చెబితే థియేటర్ దద్దరిల్లాల్సిందే
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రం ‘అఖండ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2021లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తిని ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. అందరికి పరిచయం ఉన్న, అద్భుతమైన నటనా అనుభవం, అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఉన్న వ్యక్తికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. మరోవైపు ‘అఖండ 2’ సినిమాలో కీలక పాత్ర కోసం 16 నుంచి 18 ఏళ్ల అమ్మాయిని తీసుకోనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మొదటి సినిమాకు మించి అఖండ 2 సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అఖండ విజయాన్ని మించి అఖండ 2 సాధిస్తుందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. డిసెంబర్ లో అఖండ 2 షూటింగ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ పాత్ర తాలూకు ఇంట్రడ్యూసింగ్ షాట్స్ ను తీస్తారట. మొత్తానికి ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’కు స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై కసరత్తులు చేస్తున్నారు. కాగా ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీతో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

‘గేమ్ ఛేంజర్’ కథ ఎవరి కోసం రాసారో తెలిస్తే షాక్ అవుతారు.?
మెగా పవర్ స్టార్  రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు.   ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్  నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ప్రస్తుతం షూటింగ్  చివరి దశలో ఉంది.ఇటీవల రిలీజ్ అయిన రా మచ్చ లిరికల్సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. డిసెంబరు 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది గేమ్ ఛేంజర్. కాగా ఈ సినెమా గురించి దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓ ఇంటర్వ్యూ లో దిల్ రాజు మాట్లాడుతూ ” శంకర్ దగ్గర ఓ కథ ఉందని మేనేజర్ ద్వారా తెలిసింది. శంకర్ వచ్చి కలిసి 45 నిముషాలు నరేషన్ ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు శంకర్ ను ఈ కథ కోసం ఎవరినైనా అనుకున్నారా అని అడిగాను, అయన ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కోసం అనుకున్నాను. అప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు కాదు రామ్ చరణ్ కి అయితే అదిరిపోతుంది చెప్పాను. రామ్ చరణ్ ఆ సమయంలో ‘RRR’ షూట్ లో ఉంటె నేను వెళ్లి కలిసి శంకర్ ఇలా లైన్ చెప్పారు విను అని చెప్పి శంకర్ తో కథ చెప్పించాను. చరణ్ ఒకే చెప్పడంతో అలా స్టార్ట్ అయింది గేమ్ ఛేంజర్” అని అన్నారు. ఒకవేళ పవన్ కళ్యా న్ నటించి ఉంటె ఎలా ఉండేదో రిలీజ్ అయితే కానీ తెలియదు.