NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మాజీ మంత్రి బాలినేని పిల్‌పై నేడు హైకోర్టు తుది తీర్పు..
మాజీ మంత్రి బాలినినేని శ్రీనివాస్‌రెడ్డి వేసిన పిల్‌పై ఈ రోజు తుది తీర్పు వెలువరించనుంది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. గత ఎన్నికల సమయంలో ఒంగోలులో 12 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అవకతవక జరిగాయంటూ అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి పిల్‌ వేశారు.. ఈవీఎంల వ్యవహారంపై ఆగస్టు 13వ తేదీన హైకోర్టులో పిల్ వేశారు బాలినేని.. అంతేకాదు.. ఆ పిల్‌పై ఆగస్టు 15వ తేదీన వాదనలు వినిపించారు బాలినేని తరుపున న్యాయవాది ఆలపాటి వివేకానంద.. ఇక, ఆగస్టు 17వ తేదీన తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు.. ఈరోజు బాలినేని పిల్‌పై తుది తీర్పును వెలువరించనుంది హైకోర్టు.. కాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు మాజీ మంత్రి బాలినేని.. గత ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ.. ఆయన పిల్‌ వేశారు.. అయితే, ఆ తర్వాత కీకల రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలవడం.. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరడం జరిగిపోయింది.. మరి.. ఇవాళ హైకోర్టు తుది తీర్పు ఎలా ఉండబోతోంది..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత.. ఆ పార్టీపై.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఆయన చుట్టూ ఉన్న నేతలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హాట్‌ కామెంట్లు చేసిన విషయం విదితమే..

సంతలో మద్యం విక్రయాలు.. వీడియో వైరల్‌ కావడంతో..!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త లిక్కర్‌ పాలసీ అమల్లోకి వచ్చింది.. రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్‌లలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి.. అయితే, నిబంధనలకు విరుద్ధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సంత మార్కెట్‌లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.. సంతలో మద్యం విక్రయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.. సంతలో ఓ చిన్న బెంచ్‌లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని దర్జాగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.. అదికాస్తా వైరల్‌గా మారడంతో స్పందించిన ఎక్సైజ్, పోలీసు అధికారులు… పరారైన విక్రేతలను ఫోటోలు, వీడియోలు ఆధారంగా గుర్తించి అరెస్ట్‌ చేశారు.. ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి, పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు చేసి.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.. తణుకు పట్టణానికి చెందిన షేక్ మున్న, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి సుకన్యను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.. నిందితుల వద్ద రూ.7,800 విలువైన 60 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. కాగా, ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులకు బైబై చెప్పిన కూటమి ప్రభుత్వం.. ప్రైవేట్‌ లిక్కర్‌ షాపులకు అనుమతిస్తూ కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన విషయం విదితమే.

నేడు ఆర్థిక శాఖ, సోషల్ వెల్ఫేర్‌పై సీఎం సమీక్ష..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రెండు శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి… తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు చంద్రబాబు.. ఇక, అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తున్నారు.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. ముందుగా ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తారు.. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు..

మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?.. దేవేంద్ర ఫడ్నవీస్ ఏమన్నారంటే?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మహాకూటమిలో బీజేపీ అన్నయ్య పాత్రలో ఉన్నప్పటికీ.. శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మరోసారి రాష్ట్రంలో మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. కాగా, మహాయుతి కూటమిలో సీఎం పదవిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పాల్గొన్న సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. మీరు నన్ను పరిచయం చేసినప్పుడు కొందరు నన్ను సీఎంగా భావిస్తున్నారని చెప్పారని అన్నారు. ఇది ప్రజల సమస్య. నేను దీనిని ఒక పరిష్కారంగా భావిస్తున్నాను. సమస్య లేదు. దీని అర్థం నేను సీఎం కాగలనని కాదు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాలన్నారు. ఇక మహాయుతి కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల తర్వాత తేలనుంది. మహారాష్ట్ర సీఎం ఎవరనేది మా పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మన సీఎం అంటూ పేర్కొన్నారు. మా కూటమికి ఆయనే నాయకత్వం వహిస్తున్నారని ఫడ్నవీస్ తెలిపారు.

10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్‌ నుంచి తొలగిస్తూ ఆదేశాలు
పోలీస్‌ మాన్యువల్‌కు విరుద్ధంగా ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించింది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్‌ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదిమంది బెటాలియన్స్ కానిస్టేబుళ్లలను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పదిమంది కానిస్టేబుళ్లు బెటాలియన్స్ లో అశాంతికి ప్రధాన కారణమయ్యారని డీజీపీ కార్యాలయం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పదిమంది కానిస్టేబుల్ వల్లనే మిగతావాళ్లు ఆందోళనకు దిగారని పేర్కొంది కానిస్టేబుల్ ఆందోళనకు ఈ పదిమంది కారణమయ్యారని తెలిపింది. యూనిఫామ్, క్రమశిక్షణ గల ఫోర్సులో ఆందోళనలు చేయడం ఆర్టికల్ 311కు విరుద్ధమని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలు చేయడం, న్యూస్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసి ఆందోళనలను ప్రేరేపించడం ఆర్టికల్ 311కు విరుద్ధమని తెలిపారు. సస్పెండ్ అయిన వారు వీరే..: 3వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ జి.రవికుమార్‌.. 6వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ కె.భూషణ్‌రావు.. 12వ బెటాలియన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, కానిస్టేబుల్‌ ఎస్‌కే షరీఫ్‌.. 17వ బెటాలియన్‌ ఏఆర్‌ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్‌.కరుణాకర్‌రెడ్డి, టి.వంశీ, బండెల అశోక్, ఆర్‌.శ్రీనివాస్‌లను విధుల్లోంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గూగుల్‌ ఫొటోస్‌లో కొత్త ఫీచర్‌.. ఇక ఆ సమస్యకు చెక్!
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఏఐ సాయంతో సులువుగా ఫొటోలు, వీడియోలను రూపొందిస్తున్నారు. దీంతో అసలు ఫొటో ఏదో?, ఏఐ సాయంతో రూపొందించిన ఫొటో ఏదో? తెలుసుకోవడం కాస్త కష్టంగా మారింది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ‘గూగుల్‌ ఫొటోస్‌’ సిద్ధమైంది. ‘ఏఐ ఇన్ఫో’ సాయంతో ఏఐతో క్రియేట్ ఫొటోలను సులభంగా గుర్తించవచ్చని తెలిపింది. ఏఐ ఇన్ఫో సాయంతో ఏఐ ఫొటోలను సులభంగా గుర్తించవచ్చని గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో స్పష్టం చేసింది. ఏఐ టూల్స్‌ సాయంతో ఫొటోలు ఎడిట్‌ చేస్తే మాత్రమే గుర్తించవచ్చని గూగుల్‌ తెలిపింది. గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌లో ఫొటోలకు ఎంచుకొని.. కిందకు స్క్రోల్‌ చేయగానే డీటెయిల్స్ (Details) సెక్షన్‌ ఉంటుంది. అందులో ఏఐ సాయంతో రూపొందించిన ఫొటో అయితే ‘Edited with Google AI’ అని సూచిస్తుంది. ఆ ఫొటో ఏఐతో క్రియేట్ ఫొటోలు. గూగుల్‌ ఫొటోస్‌ ఇటీవలే మ్యాజిక్‌ ఎడిటర్‌, మ్యాజిక్‌ ఎరేజర్‌ సహా ఇతర ఏఐ టూల్స్‌ను తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

భారత్‌ ఓటమికి సీనియర్‌ ఆటగాళ్లదే బాధ్యత: కార్తీక్‌
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌ ఓటమికి సీనియర్‌ ఆటగాళ్లదే బాధ్యత అని టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. జట్టుపై కోచ్‌ ప్రభావం చాలా తక్కువ అని నా అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ మైదానంలో అడుగు పెట్టడని, కెప్టెనే అన్నీ చూసుకుంటాడన్నాడు. ఓటములు ఎదురైనపుడు విమర్శలు వస్తే.. వాటినీ తీసుకోవాలని డీకే పేర్కొన్నాడు. రోహిత్ సేన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్‌కు కోల్పోయిన విషయం తెలిసిందే. ‘న్యూజిలాండ్‌ సిరీస్‌ ఓటమి బాధ్యతను సీనియర్లకు ఎందుకు ఇవ్వకూడదు. తాము ఇంకా మెరుగైన ప్రదర్శన చేసి ఉండాల్సిందేమో అని సీనియర్స్ అనుకుంటారు. జట్టు గెలిచినపుడు, ఏదైనా కప్ సాధించినపుడు సంబరాలు చేసుకున్నట్లే.. ఓటములు ఎదురైనపుడు వచ్చే విమర్శలను తీసుకోవాలి. సీనియర్లు ఈ సిరీస్‌లో ఏం సాధించారో చెప్పడానికి ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు మ్యాటర్ అది కాదు. భారత టెస్టు క్రికెట్‌ భవిష్యత్తు కోసం ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలి’ అని దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు.

నితీశ్‌ రెడ్డి ఒక్కడే.. ఇదే సూపర్ ఛాన్స్!
ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి సత్తాచాటిన విషయం తెలిసిందే. 303 పరుగులు చేసి, 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ ప్రదర్శనతో భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇటీవల భారత్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్‌.. ఇప్పుడు టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత టెస్టు జట్టులో నితీశ్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్‌పై తన అరంగేట్ర సిరీస్‌లో నితీశ్‌ రెడ్డి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (90 పరుగులు, 3 వికెట్లు) చేశాడు. హార్దిక్‌ పాండ్యా లాంటి పేస్‌ ఆల్‌రౌండర్లు గాయాల బారిన పడుతుండటంతో.. భవిష్యత్‌ ప్రత్యామ్నాయంగా నితీశ్‌పై సెలక్టర్లు దృష్టి సారించారు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన 18 మంది ఆటగాళ్ల భారత జట్టులో నితీశ్‌ ఒక్కడే పేస్‌ ఆల్‌రౌండర్‌ కావడం విశేషం. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కితే.. ఆసీస్‌ పిచ్‌లపై మనోడు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా-ఏతో సిరీస్‌ కోసం భారత్‌-ఏ తరపున నితీశ్‌ రెడ్డి కంగారూ గడ్డపై ఆడాడు. రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లతో అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చే అవకాశముంది. మంచి ఫామ్ మీదున్న నితీశ్‌కు తుది జట్టులో చోటు దక్కితే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకూ 21 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన నితీశ్‌.. 708 పరుగులు, 55 వికెట్లు తీశాడు.

క్షమాపణలు కావాలా.. అయితే వేచివుండండి
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు శ్రీకాంత్ అయ్యంగర్ అలియాస్ శ్రీకాంత్ భరత్. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టెల్ సినిమాలోను నటించి మెప్పించారు. శ్రీకాంత్ అయ్యంగర్ పొట్టెల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్స్ పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెను దుమారం రేపాయి. జీవితంలో షార్ట్ ఫిల్మ్ తీయడం చేతకాని నా కొడుకులు కూడా రివ్యూ రాస్తున్నారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా లేని నా కొడుకులు వాళ్ళుఅంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. మరోవైపు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసింది. శ్రీకాంత్ వ్యాఖ్యలను మీడియా తీవ్రంగా ఖండిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మాటలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అని ఫిల్మ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌ ఫిర్యాదులో పేర్కొంది. ఈ వివాదంపై మరోసారి స్పందిస్తూ తాజగామరో వీడియో రిలీజ్ చేసారు శ్రీకాంత్. ఆ వీడియోలో మాట్లాడుతూ ‘ నమస్కారం నేను భరత్ శ్రీకాంత్, పొట్టెల్ సినిమా సక్సెస్ మీట్ లో నేను కొన్ని మాటలు మాట్లాడాను దాంతో కొందరికి నేను భాద కలిగించును. త్వరలో మీ అందరికి కరెక్ట్ విషయాల మీద బేషరతు క్షమాపణ ఇవ్వబోతున్నాను. దయచేసి వేచి ఉండండి’ అని అన్నారు. ఆ వీడియోపై శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణ చెప్తాను అనేలా లేదు.. ఇంకేదో గెలుకుతాను రెడీగా ఉండండి అన్నట్టుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అందాల తమన్నా.. ఎంత బాగుందో ముద్దుగుమ్మ..
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక పీరియడ్ లో టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. స్టార్ హీరోల ప్రతి సినిమాలోను ఈ ముద్దగుమ్మే ఉండేది. పాలలాంటి తెలుపుతో పాటు వెన్న లాంటి మనసు చక్కటి అభినయం, చూడచక్కని సొగసులు అమ్మడి సొంతం. తన అద్భుతమైన నటనతో తెలుగు నాట విశేషమైన అభిమానాన్ని సంపాదించింది తమ్ము. ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు కాస్త తగ్గినా అప్పుడడప్పుడు స్పెషల్ సాంగ్ లో మెరుస్తుంటుంది. ఇదిలా ఉండగా తమన్నా కొన్నేళ్లుగా విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉంది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘MCA’‌ సినిమాలో విలన్‌ రోల్ చేసిన అతడే తమ్ము మనసు దోచిన ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌. అయితే ఈ జంట నిన్న ముంబైలోని ఓ దివాళి ఈవెంట్‌ లో పాల్గొన్నారు. బాలీవుడ్ నిర్మాత రమేశ్ తౌరాణి నిర్వహించిన ఈ దివాళి ఈవెంట్‌లో ప్రియుడితో కలిసి పాల్గొన్నతమన్నాస్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. లాంగ్ పింక్ కలర్ డ్రెస్‌లో తుంటరి చూపులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.  ప్రస్తుతం తమన్నా, విజయ్ పోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు తమ్ము ఫ్యాన్స్. త్వరలోనే ఈ హాట్ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా బాలీవుడ్ గుసగుసలాడుతుంది. ఇక సినిమాలు విషయానికి వస్తే మిల్కి బ్యూటీ ఇటీవల శ్రద్ద కపూర్ నటించిన స్త్రీ -2 లో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. ఈ పాట తమ్ము డాన్స్ ఆడియన్స్ కు కిక్ ఎక్కించింది. తమిల్ లో ఒక సినిమాతో పాటు పలు వెబ్సిరీస్ లో నటిస్తోంది తమ్ము.