NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

సంక్షేమం, విద్యా, వైద్యానికి సర్కార్‌ పెద్ద పీట..
బడ్జెట్‌లో సంక్షేమం, విద్యా, వైద్యానికి పెద్ద పీట వేసింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. మొత్తం బడ్జెట్ లో ఆర్ధిక సేవలకు వ్యయం 69, 306 కోట్లుగా ఉంది.. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది.. 51,345 కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయించారు.. మొత్తం కేటాయింపుల్లో ఇది 27 శాతం.. సాధారణ విద్యకు రెండో ప్రాధాన్యత కేటాయింపులు లభించాయి.. మాధ్యమిక, ఉన్నత విద్యకు 32,198 కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపుల్లో ఇది 16 శాతంగా ఉంది.. మూడవ ప్రాధాన్యత వైద్య, ఆరోగ్య శాఖకు దక్కింది.. ఈ రంగానికి 15, 882 కోట్ల రూపాయలు కేటాయించారు.. మొత్తం కేటాయింపుల్లో వైద్యా, ఆరోగ్య శాఖ వాట 8 శాతంగా ఉంది. వార్షిక బడ్జెట్‌లో ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కోవిడ్ అనంతరం ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే రోజులలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈవిషయంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రాథమిక స్థాయి నుంచి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ స్థాయికి మార్చడంతో పాటు సౌకర్యాల భౌతిక స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా, అవసరమైన పరికరాలు, శిక్షణ పొందిన మానవ వనరులను సమకూర్చడంలో ఎంతో ఉపయోగపడనుంది.

అంకెల గారడీతో మాయ చేశారు.. అప్పులను ఆదాయంగా చూపారు..!
అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ 2023-24పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.. అప్పులను ఆదాయంగా చూపించ కూడదని ఆర్బీఐ చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా అసెంభ్లీసాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారు. ఆయన అందుకు విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బడ్జెట్ కు తనవాదనలను సమర్ధించుకుంటూ రాష్ట్రప్రజలకు అవాస్తవాలను శాసన సభలో వెల్లడించారని తప్పుపట్టారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనంగా శాసన సభలో ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకునే రుణాలు ఎంత అనేది వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం కాగ్ కు కూడా నివేదిస్తున్నారో లేదో తెలియని గందరగోళం ప్రభుత్వంలో కొట్టచ్చినట్లు కనపడుతోంది. విభజన ఆంధ్రప్రదేశ్‌కు అంటే 2014 నుండి రాష్ట్రానికి 9 లక్షల3 వేల 336 కొట్లు అప్పులు ఉన్న పరిస్ధితి.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులను ఈ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకున్న విధంగా ఇది ఒక స్టిక్కర్ బడ్జెట్ గా అభివర్ణించారు సోమువీర్రాజు.

కేఏ పాల్‌ను చంపేందుకు కుట్ర..!
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. మెడికో ప్రీతి కేసు, ఇతర ప్రభుత్వాల వైఫల్యాలపై నేను గట్టిగా ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్‌ చేశారు. నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. నాపై ఉన్న తప్పుడు కేసును రీఓపెన్‌ చేశారు.. అది తప్పుడు కేసు అంటూ గతంలో ఖండించిన కేసీఆర్‌.. ఇప్పుడు కుట్ర చేస్తున్నారు.. స్టే ఉన్న మహబూబ్‌నగర్‌ కేసును ఓపెన్‌ చేసి.. నన్ను మహబూబ్‌నగర్‌ పంపి.. మా అన్నయ్యను చంపిన టీమ్‌ ద్వారా… నన్ను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. గతంలో నన్ను జైలులో పెట్టి.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించిన కేఏ పాల్.. ఇప్పుడు అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.. నాపై ఉన్న కేసు చట్ట విరుద్ధమని హైకోర్టు స్టే ఇచ్చిందన్న పాల్.. ఇప్పుడు రీ ఓపెన్‌ చేసి.. నాపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇక, మధ్యలో ఢిల్లీ లిక్కర్‌ కేసు ప్రస్తావన తీసుకువచ్చారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు.. కేసులు, అరెస్ట్‌లను ప్రస్తావించారు.. కేఏ పాల్‌ చేసినసంచనల వ్యాఖ్యల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

మాక్సిమం పాలిటిక్స్ మినిమం రూలింగ్.. ఇదే కేసీఆర్ పాలన
మాక్సిమం పాలిటిక్స్ మినిమం రూలింగ్ అన్నట్లుగా కేసీఆర్ పాలన సాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కెసిఆర్‌కు ప్రతీదీ రాజకీయం చేయడం పరిపాటి అయ్యిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు, కవిత లిక్కర్ కేసు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్.. ఇలా అన్నింటినీ రాజకీయం చేసి, తన అసమర్థత – అవినీతి పాలనను కప్పిపుచ్చుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడని పేర్కొన్నారు. కోటి ఆశలతో పరీక్షలకు ప్రిపేర్ అయిన నిరుద్యోగులపై.. ఈ పేపర్ లీక్ వార్త పిడుగు పడినట్లు అయ్యిందన్నారు. ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి, సమగ్ర దర్యాప్తు చేయించి, కేసీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని కోరారు. సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించి, దోషులు తప్పించుకొకుండా వారికి కఠిన శిక్ష పడేలా చూడాల్సిన ముఖ్యమంత్రి.. రాజకీయ రంగు పూసి తప్పించుకోవాలని చూడడం తన అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు.. చీకట్లో నెట్టారు
బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ మహిళ నేత విజయశాంతి తాజాగా నిప్పులు చెరిగారు. వనస్థలిపురంలో మహిళ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఆమె.. మహిళకు మెతక వైఖరి పనికిరాదని, హార్డ్‌గా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళకు రక్షణ లేదని ఆరోపించారు. డ్వాక్రా మహిళల జీవితాల్ని చీకట్లో నెట్టారన్నారు. పామ్‌హౌస్‌లో పడుకునే సీఎం నెలకు రూ.4 లక్షలు తీసుకుంటాడు కానీ.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడని ఆరోపణలు చేశారు. గిరిజన పోడు భూములను లాక్కొని, వారిని జైల్లో పెట్టారన్నారు. అధికార పార్టీ మహిళ సర్పంచ్ పట్ల ఓ ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడితే.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను ‘లిక్కర్ డాన్’గా పేర్కొన్నారు. ఈడీ, సీబీఐలు పిలిస్తే కవిత వెల్లడం లేదని.. తప్పు చేసి కూడా మహిళ అని తప్పించుకుందామని చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబం మొత్తం క్రిమినల్ మైండ్ ఉన్న నాయకులేనని, ఆ కుటుంబంలో మొదటి వికెట్ కవిత నుండే ప్రారంభమైందని అన్నారు. ఈ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు సైతం మహిళల్ని వేధిస్తున్నారని.. ఏనాడైనా మహిళలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేను సీఎం కేసీఆర్ సస్పెండ్ చేశారా అని విజయశాంతి ప్రశ్నించారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా.. కేసీఆర్ చలనం లేకుండా ఉంటున్నారని.. అవసరానికి మాత్రమే పని చేయించుకొని, ఆ తర్వాత అవతలికి పొమ్మంటున్నారని అన్నారు. మహిళలు స్వతంత్రంగా బతికే స్వేచ్ఛను ఇచ్చే విధంగా సీఎం విధానాలు లేవన్నారు.

‘జోధా అక్బర్’ నటుడిపై అమెరికాలో కత్తితో దాడి
అమెరికాలో పంజాబీ నటుడు అమన్ ధాలివాల్ పై దాడి జరిగింది. ఓ జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా, అతడిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. దుండగుడు కత్తిని చూపి ఇతర జిమ్ సభ్యులను బెదిరించాడు. ఓ వైపు గాయాలతో రక్తమొడుతున్నా నటుడు సదరు వ్యక్తి దాడి చేయకుండా చేతిని పట్టుకున్నాడు. ఆ తర్వాత అదును కోసం చూస్తూ ఒక్కసారిగా నిందితుడిపై దాడి చేశాడు. ఆ తర్వాత దాడికి పాల్పడిన వ్యక్తిని మరికొందరు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఆ తర్వాత అమన్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. మెడతో పాటు చేతులకు కత్తి గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా.. అమన్‌ స్వస్థలం పంజాబ్‌లోని మాన్సా… హృతిక్‌ రోషన్‌, ఐశ్వర్యరాయ్‌ జంటగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘జోధా అక్బర్‌’తో పాటు పలు పంజాబీ సినిమాల్లోనూ నటించాడు. ప్రస్తుతానికి, అమన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

స్టెప్పులేసిన టీమిండియా మాజీలు.. నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్..
లెజెండ్ లీగ్ క్రికెట్2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియా మహారాజాన్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నాటు నాటు సాంగ్ కు చిందేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సీఎస్కే మాజీ క్రికెటర్లను అభిమానులు రామ్ చరణ్, తారక్ లతో పోలుస్తూ కామెంట్ల వర్షం కురిస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఇండియా మహారాజాస్ తో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహారాజన్.. సురేశ్ రైనా( 41 బంతుల్లో 49, 2 ఫోర్లు, 3 సిక్సులు), బిస్లా(36), ఇర్ఫాన్ పఠాన్(25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. వరల్డ్ జెయింట్స్ బౌలర్లు బ్రెట్ లీ( 3-0-18-3), పోఫు(4-0-22-2), టీనో బెస్ట్(4-0-27-2) చెలరేగారు. అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ జెయింట్స్.. క్రిస్ గేల్ (46 బంతుల్లో 57, 9 ఫోర్లు, సిక్స్) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్ కు షేన్ వాట్సన్(26), సమిత్ పటేల్(12) సహకరించారు. మహారాజాన్ బౌలర్లలో యూసఫ్ పఠాన్(4-0-14-2), ప్రవీణ్ తాంబే( 4-0-22-1), హర్భజన్(4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో వికెట్లు పడగొట్టి తమ జటటును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.

సక్సెస్ వస్తే నా పేరు చెప్పి.. ఫెయిల్యూర్ అయితే డైరెక్టర్ పేరు చెప్పను
న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తన సినిమా ప్రమోషన్స్ లో నాని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. దాని వలన కొన్ని విమర్శలు కూడా అందుకున్నాడు. తనకు అనిపించినా అభిప్రాయం చెప్పానే కానీ, ఒకరిని తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడలేదని నాని ఎప్పటికప్పుడు చెప్పుకొస్తూనే ఉంటాడు. ఇక తాజాగా దసరా ప్రమోషన్స్ లో కూడా నాని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. సాధారణంగా నాని తన సక్సెస్ ను యాక్సప్ట్ చేస్తాడు కానీ ఫెయిల్యూర్ ను మాత్రం ఎప్పటికీ యాక్సప్ట్ చేయడు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అదే విషయమై నాని తనదైన శైలిలో సమాధానం చెప్పి షాక్ ఇచ్చాడు. నాని కెరీర్ లో కొన్ని ప్లాప్స్ ఉన్నాయి.. అందులో టక్ జగదీశ్, వి లాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలు రెండు పరాజయాన్ని చవిచూశాయి. కానీ, నాని మాత్రం ఈ రెండు సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించితిన్, వీక్షించిన సినిమాలు అని నాని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. అంటే నాని ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయలేడా? అని తాజా ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురయ్యింది. దానికి నాని సమాధానం చెప్తూ.. ” నా సైడ్ నిజం మీకు తెలియనప్పుడు మీరెలా దీన్నీ నిజం అనుకుంటారు. నాని ఎందుకు ఫెయిల్యూర్ ను కూడా డిఫెండ్ చేస్తాడు అని అడుగుతున్నారు కదా.. నేను ఎందుకు డిఫెండ్ చేస్తాను.. దాని రక్షించాలని నేను ఎందుకు చూస్తాను.. అది ఫెయిల్యూర్ అయిపోయింది.. దానివలన జరిగిన నష్టం నాకు జరిగిపోయి ఉంటుంది.