Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మరోసారి హస్తినకు సీఎం చంద్రబాబు.. అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తినకు వెళ్లనున్నారు.. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బయల్దేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ సారి ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం రోజు అంటే రేపు ఐదుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు. కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో సహా పలువురితో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. ఈ వరుస సమావేశాల అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం చంద్రబాబు నాయుడు..

అంబటి రాంబాబుకు మరో షాక్‌.. ఇంకో కేసులో 14 రోజుల రిమాండ్‌..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో షాక్‌ తగిలింది.. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును పీటీ వారెంట్‌పై పట్టాభిపురం పోలీసులు గుంటూరు కోర్టుకు హాజరుపరిచారు. అయితే, ఈ కేసులోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగలింది.. మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. ఇక మరోవైపు, గుంటూరు మొబైల్ కోర్టులో అంబటి రాంబాబు కస్టడీ పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ అనంతరం అంబటి రాంబాబును తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

యాక్సిడెంట్ బాధితులకు హెల్ప్ చేస్తే మీ ఖాతాలోకి రూ.25,000.!
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రజలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ‘రహ-వీర్’ (Rah-Veer) పథకాన్ని అమలులోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర సమయంలో సహాయం అందించి, వారి ప్రాణాలను కాపాడే వ్యక్తులకు భారీ నగదు బహుమతిని ప్రకటించింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న వారు పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో సహాయం చేయడానికి వెనుకాడుతుంటారు. ఈ భయాన్ని పోగొట్టి, బాధితులకు ‘గోల్డెన్ అవర్’ (ప్రమాదం జరిగిన మొదటి గంట) లోపు వైద్యం అందేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఎవరైనా వ్యక్తి రోడ్డు ప్రమాద బాధితులను కాపాడి, సరైన సమయంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలను నిలబెడితే, ప్రభుత్వం వారిని ‘రహ వీర్’గా గుర్తిస్తుంది. ఇలాంటి ప్రాణదాతలకు తెలంగాణ రవాణా శాఖ రూ.25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తుంది.

రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌ను మించి ఫ్రాడ్‌.. డిజిటల్‌ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల డబ్బు రక్షణలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేసింది. అనుమానాస్పద లావాదేవీలు జరిగితే ఖాతాదారులకు తక్షణమే అలర్ట్ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. అకస్మాత్తుగా భారీ మొత్తాల లావాదేవీలు జరిగితే బ్యాంకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. అవసరమైతే ఆ లావాదేవీలపై తాత్కాలికంగా హోల్డ్ పెట్టే అధికారం బ్యాంకులకు ఉండాలని స్పష్టం చేసింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లలో ప్రధానంగా వృద్ధులు, సాధారణ ఖాతాదారులే బాధితులవుతున్నారని పేర్కొంది సుప్రీంకోర్టు… ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు అత్యంత తీవ్రమైనవిగా అభివర్ణించింది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించేందుకు AI, ఆధునిక టెక్నాలజీని బ్యాంకులు వినియోగించాలి అని ధర్మాసనం సూచించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) ను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సైబర్ మోసాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం, RBI, బ్యాంకులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాకుండా, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే తీవ్రమైన సమస్యగా అభివర్ణించింది. ఇక, హోం మంత్రిత్వ శాఖ (MHA) గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2021 నుంచి నవంబర్ 2025 వరకు దాదాపు రూ.52,000 కోట్లకు పైగా సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఈ మొత్తం అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌ను మించిపోవడం గమనార్హం. ఈ స్థాయిలో మోసాలు జరగడం దేశ ఆర్థిక భద్రతకు పెద్ద ముప్పుగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లను కట్టడి చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని, ప్రజల సొమ్ము రక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అప్పుడు అబ్బాయి.. ఇప్పుడు బాబాయి! క్షీణించిన శరద్ పవార్‌ హెల్త్..
NCP (SP) అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోగ్యం సోమవారం ఒక్కసారిగా క్షీణించింది. వెంటనే ఆయనను బారామతి నుంచి పూణేకు తీసుకెళ్లి రూబీ హాల్ క్లినిక్‌లో చేర్చారు. పవార్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని, దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతోందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పదమూడవ రోజు కార్యక్రమానికి సోమవారం బారామతి తాలూకాలోని కథేవాడిలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి శరద్ పవార్, ఆయన కుటుంబ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా, ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్‌ను పుణేలోని రూబీ ఆసుపత్రిలో చేర్చారు. శరద్ పవార్ వెంట ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సులే కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పూణేలోని రూబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. శరద్ పవార్ నిరంతర దగ్గు, కఫంతో బాధపడుతున్నారని, దీని వలన ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టమవుతోందని పవార్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి గత కొన్ని రోజులుగా శరద్ పవార్ అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. అనారోగ్యం కారణంగా, ఆయన గత రెండు, మూడు నెలలుగా అన్ని బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ ఆకస్మిక మరణం తరువాత, ఆయన పార్టీ కార్యకర్తలు, ప్రజలతో తిరిగి సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయన అలసిపోయి, అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. మరో సర్వీస్ ప్రారంభించిన IRCTC
భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం ‘ఈ-ప్యాంట్రీ’ సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా ప్రయాణికులు తమ సీట్లను వదిలి వెళ్లే అవసరం లేకుండానే.. వారి బర్త్‌ దగ్గరకే శుభ్రమైన, వేడి ఆహారం మరియు ప్యాకేజ్డ్ వాటర్‌ను ముందుగానే బుక్ చేసుకుని పొందవచ్చు. ఇంతకుముందు ఆన్‌లైన్ ఫుడ్ బుకింగ్ సౌకర్యం ప్రీమియం రైళ్లకే పరిమితమై ఉండగా, తాజాగా ఈ సేవను 25 మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విస్తరించారు. టికెట్‌లో భోజనం చేర్చబడని రైళ్లలో ప్రయాణించే వారికి ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ-ప్యాంట్రీ సేవ IRCTC వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ధృవీకరించబడిన (Confirmed), RAC లేదా పాక్షికంగా ధృవీకరించబడిన టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు బుకింగ్ సమయంలో లేదా తరువాత “Book Ticket History” విభాగంలోకి వెళ్లి ప్రామాణిక భోజనం లేదా ‘రైల్ నీర్’ ప్యాకేజ్డ్ వాటర్‌ను ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు. ఆర్డర్ చేసిన తర్వాత ప్రయాణికులకు SMS లేదా ఇమెయిల్ ద్వారా నిర్ధారణ సందేశంతో పాటు Meal Verification Code (MVC) పంపబడుతుంది. ప్రయాణ రోజున రైలులో ఉన్న విక్రేతకు ఈ MVC చూపిస్తే, ఆహారం నేరుగా ప్రయాణికుల సీటుకు డెలివరీ చేయబడుతుంది.

భారత్‌ను ప్రపంచం మార్కెట్‌గా చేస్తోంది.. అభివృద్ధిని కోరుకోవడం లేదు… అనిల్ అగర్వాల్ సంచలన పోస్ట్..
వేదాంత గ్రూప్ చైర్మన్, బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలు భారత్‌ను ఉత్పత్తి కేంద్రంగా కాకుండా కేవలం మార్కెట్‌గా మాత్రమే చూస్తున్నాయని, భారతదేశం పురోగతిని ప్రపంచం కోరుకోవడం లేదని ఆయన తన తాజా పోస్టులో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనిల్ అగర్వాల్, ఇటీవల వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ ప్రజా చర్చల్లోకి వచ్చారు. X (ట్విట్టర్)లో చేసిన పోస్టులో, భారత్ స్వావలంబన దిశగా మరింత వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రపంచం భారత్‌ను వినియోగ మార్కెట్‌గా మాత్రమే చూడాలనుకుంటోందని, ఉత్పత్తి దేశంగా ఎదగడం కొందరికి ఇష్టంలేదని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనను భారత్ తిరస్కరించాల్సిన అవసరం ఉందని, దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించాలని సూచించారు. ఒకప్పుడు ఆహారం కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్, నేడు స్వయం సమృద్ధి సాధించిందని, ప్రభుత్వ విధానాలు మరియు ఉద్యమాల వల్లే ఇది సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. భారతదేశ ఇంధన భద్రతపై కూడా అనిల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశానికి అవసరమైన చమురు, గ్యాస్‌లో సుమారు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నామని, ఇది భారత్‌ను దుర్బలంగా మారుస్తోందని అన్నారు. మూడు వైపులా సముద్రం ఉన్న దేశంగా, ఏదైనా అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఏర్పడితే ఇంధన సరఫరా తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే 20 సంవత్సరాల్లో భారత్‌లో చమురు, గ్యాస్ డిమాండ్ మరింత పెరగనుందని, ఈ పరిస్థితిలో దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.

స్కాట్లాండ్‌ భారీ విజయం.. కట్ చేస్తే పాయింట్ల పట్టికలో!
టీ20 ప్రపంచకప్‌ 2026 ఆదిలోనే సంచలనాలకు వేదికగా మారేందుకు సిద్ధమైంది. ఈ పోరు గ్రూప్-C లో మరింత ఆసక్తికరంగా మారింది. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు ఇటలీపై ఏకంగా 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో సంచలనం సృష్టించింది. ఈ విజయంతో స్కాట్లాండ్ గ్రూప్-Cలో ఇంగ్లాండ్‌ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది. మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిన స్కాట్లాండ్, తర్వాతి మ్యాచ్‌ లో మంచి ప్రదర్శనతో తిరిగి పోటీలో నిలిచింది. ప్రస్తుతం గ్రూప్-Cలో వెస్టిండీస్ +1.75 నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉండగా.. స్కాట్లాండ్ +0.95 నెట్ రన్‌ రేట్‌ తో రెండో స్థానంలో నిలిచింది. ఇక మరోవైపు ఒక విజయం సాధించిన ఇంగ్లాండ్ నెట్ రన్‌రేట్ పరంగా వెనుకబడి ఉంది. ఇక గ్రూప్-Cలో తర్వాత మ్యాచ్ లో స్కాట్లాండ్-ఇంగ్లాండ్ తలపడుతుంది. దీనితో ఈ గ్రూప్ భవిష్యత్తు తేలనుంది. ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో జార్జ్ మున్సే 54 బంతుల్లో 84 పరుగులు చేసి భారీ స్కోర్ కు బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా మైఖేల్ జోన్స్ 37 పరుగులు చేయగా, బ్రెండన్ మెక్‌ముల్లెన్ 18 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. చివర్లో మైఖేల్ లీస్క్ కేవలం 5 బంతుల్లో 22 పరుగులు చేసి స్కోరును భారీగా పెంచేసాడు.

నాని ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్..
‘దసరా’ లాంటి ఊర మాస్ హిట్ తర్వాత, న్యాచురల్ స్టార్ నాని-శ్రీకాంత్ ఓదెల కాంబో అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ‘ది ప్యారడైజ్’ మూవీతో మరోసారి జత కడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నా ఈ మూవీలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ నుండి ఓ పవర్ ఫుల్ అప్‌డేట్ వచ్చేసింది. ఏంటంటే.. నాని పుట్టినరోజు సందర్భంగా ‘ది ప్యారడైజ్’ నుంచి మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ సినిమాలోని మొదటి పాట ‘ఆయా షేర్’ (Aaya Sher) విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, ఈ సాంగ్ ఒక పక్కా మాస్ డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. అనిరుధ్ – నాని కాంబోలో వచ్చిన ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ పాటలు ఇప్పటికే క్లాసిక్స్‌గా నిలవగా, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వారు అందిస్తున్న మాస్ బీట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రచ్చ!
నేటి జనరేషన్ పల్స్ తెలిసిన దర్శకుడు తరుణ్ భాస్కర్, ఇప్పుడు నటుడిగా తన సత్తా చాటేందుకు ‘గాయపడ్డ సింహం’తో వస్తున్నారు. టీజర్ ట్రైలర్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇటీవలే ‘ఓం శాంతి శాంతి శాంతి’తో హీరోగా పలకరించిన ఆయన, ఈసారి పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో హిట్టు కొట్టాలని కంకణం కట్టుకున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘చిట్టి’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. అమెరికా వెళ్లాలనే బలమైన కోరిక ఉన్న ఒక యువకుడి చుట్టూ తిరిగే ఈ కథలో తరుణ్ కామెడీ టైమింగ్ అద్భుతంగా కుదిరింది. అయితే, ట్రైలర్ మొత్తానికి హైలైట్ ఏమిటంటే.. తరుణ్ భాస్కర్ తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పెళ్లి చూపులు’ సినిమాపైనే సెటైర్ వేసుకోవడం. “పెళ్లి చూపుల గురించి మీ అభిప్రాయం ఏంటి?” అని అడిగితే.. “ఓ యావరేజ్ సినిమా” అని తరుణ్ చెప్పే డైలాగ్ చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఒక దర్శకుడిగా తరుణ్ భాస్కర్‌కు ఉన్న క్రేజ్, ఇప్పుడు హీరోగా ఈ సినిమాకు ఏ స్థాయిలో వసూళ్లు తెచ్చిపెడుతుందో చూడాలి.

Exit mobile version