NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు..!
ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే వర్షాలు.. వరదలతో అతలాకుతలం అవుతోంది.. ముఖ్యంగా విజయవాడ సిటీ.. పరసిర ప్రాంతాల్లో పరిస్థితి చిత్తడిగా మారిపోయింది.. వేలాది మంది బాధితులు.. ఆహారం, తాగునీటి కోసం వేచిచూడాల్సిన పరిస్థితి.. మరోవైపు.. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది.. ఇప్పుడిప్పుడే వర్షం నుంచి అంతా తేరుకుంటుండగా.. ఏపీకి మరో అల్పపీడనం ముప్పు తప్పదంటూ వాతావారణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు మళ్లీ కలవర పెడుతున్నాయి.. ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతుంది.. అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు మారుతున్నాయని.. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కృష్ణా జిల్లా.. గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది.. ఎన్టీఆర్‌ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలకు “ఆరేంజ్” బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది.. వచ్చే 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. ఇదే సమయంలో వరద ముంపు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని.. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ బులెటిన్ విడుదల చేశారు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు..

వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రండి.. సీఎం పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.. ఇప్పటకీ విజయవాడలోని చాలా కాలనీలను వర్షపునీరు వీడలేదు.. ఈ నేపథ్యంలో.. వరద బాధితులను ఆదుకనేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశామన్నారు.. ఇక, ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్ కు అప్పగించారు.. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం..

తెగిన బుడమేరు కాలువ కట్ట.. ఎన్‌హెచ్‌ 16పైకి వరద నీరు..
కృష్ణా జిల్లా గన్నవరంలో గూడవల్లి వద్ద బుడమేరు కాలువ కట్ట తెగిపోయింది.. దీంతో.. బుడమేరు కాలువ నుంచి జాతీయ రహదారి 16పైకి వరద నీరు చేరుతుంది.. నిడమానూరు నుండి గూడవల్లి వరకు జాతీయ రహదారిపైకి వరద నీరు చేరిపోయింది.. దీంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. మరోవైపు.. రామన్ భవన్ 2 కాలేజీలోకి ప్రవేశించింది బుడమేరు వరద నీరు.. ఇంకోవైపు.. శ్రీ చైతన్య కాలేజీలోకి కూడా బుడమేరు వరదనీరు వచ్చి చేరింది.. దీంతో.. కాలేజీకి సెలవు ప్రకటించి.. విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు చైతన్య కాలేజ్ యాజమాన్యం.. కాలేజీలో నుండి గూడవల్లి వద్ద జాతీయ రహదారిపైకి చేరుతోంది బుడమేరు కాలువలోని వరద నీరు… జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.. ఇలాగే వరద ఎక్కువ కొనసాగితే.. విజయవాడ నుండి ఏలూరు వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరే ప్రమాదం ఉంది.. ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ కష్టంగా మారే అవకాశం ఉందంటున్నారు అధికారులు..

చెరువుల ఆక్రమణలపై రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్
వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై బ్లూబుక్‌ను తయారు చేసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. వాటిని కలెక్టరేట్లలో ఉంచాలన్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదైందని.. ఈ జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని తెలిపారు. వరంగల్‌పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. రాంనగర్‌ నాలాపై అక్రమ కట్టడాలను తొలగించడంతో వరద ముంపు తప్పిందన్నారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగామని అభినందించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామన్నారు. కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఆస్తి, ప్రాణ నష్ట పరిశీలనకు ప్రధాని మోడీని ఆహ్వానించామన్నారు. తక్షణమే రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరారు.

అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. సెప్టెంబర్ 11 వరకు కస్టడీ పొడిగింపు..!
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబై దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు దుర్గేష్‌ పాఠక్‌లకు సమన్లను జారీ చేసింది. అలాగే, ఈ కేసు సెప్టెంబర్‌ 11వ తేదీన విచారణ జరుగనుంది. ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ను రిలీజ్ చేస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిన్న (సోమవారం) ఆయనకు కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) అరెస్టు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో జూన్‌ 20న ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా.. ఆ బెయిల్‌ పై స్టే ఇస్తూ.. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. జులై 14వ తేదీన ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ను ఇవ్వగా.. సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందే సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం సీబీఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్‌ కస్టడీపై తిహార్‌ జైలులో ఉండిపోయారు.

ప్రాణాలు తీసిన నూడుల్స్.. తిని నిద్రలోనే చనిపోయిన బాలిక
చిన్న పిల్లలు నూడుల్స్ అనగానే లొట్టలేసుకుంటారు. అంతగా వాళ్లు దాన్ని ఇష్టపడి తింటారు. పైగా క్షణాల్లో తయారు కావడం.. తక్కువ ధరలోనే దొరకడంతో పిల్లలు నూడుల్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అదే ఆ బాలిక పాలిట శాపమైంది. స్కూల్ నుంచి రాగానే.. ఆకలి తీర్చుకునేందుకు నూడుల్స్ రెడీ చేసుకుని తింది.. తిన్న కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ హఠాత్తు మరణంపై దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలను అన్వేసిస్తున్నారు. తమిళనాడులోని తిరుచ్చిలో 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని తన ఇంట్లోనే నూడుల్స్ తయారు చేసి తిన్న తర్వాత శవమై కనిపించింది. బాలిక ఆన్‌లైన్‌లో ‘బుల్డాక్ నూడుల్స్’ ఆర్డర్ చేసింది. తయారు చేసుకుని తిన్న తర్వాత ప్రాణాలు వదిలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. బాలిక మరణానికి గల కారణాలపై అన్వేసిస్తున్నారు. అలాగే పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు తిరుచ్చిలోని నూడుల్స్ హోల్‌సేల్ వ్యాపారులపై దాడి చేసి 800 కిలోల గడువు ముగిసిన చైనీస్ నూడిల్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యోగి సర్కార్‌.. ఆస్తుల వివరాలు వెల్లడిస్తేనే జీతాలు!
ప్రభుత్వ ఉత్తర్వులు, రిమైండర్‌లు ఉన్నప్పటికీ మానవ్ సంపద పోర్టల్‌లో తమ ఆస్తుల వివరాలను ఇవ్వని యూపీలోని 2 లక్షల 44 వేల 565 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. వీరికి ఆగస్టు నెల జీతం నిలిచిపోయింది. కొత్త ఆర్డర్ ప్రకారం, ఉద్యోగులు ఆగస్టు 31 లోగా మానవ సంపద పోర్టల్‌లో తమ చర, స్థిరాస్తుల వివరాలను అప్‌లోడ్ చేయాలి. శాఖల నివేదికల ఆధారంగా.. 2,44,565 మంది ఉద్యోగులు చివరి తేదీ దాటినా ఉత్తర్వులను పాటించలేదు. దీని కారణంగా వారి జీతాలు నిలిచిపోయాయి. యూపీలోని ప్రభుత్వ విభాగాల్లో 8 లక్షల 46 వేల 640 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్‌, పీసీఎస్‌ తరహాలో తమ ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆగస్టు 31లోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ముందుగానే.. అన్ని శాఖలకు లేఖ రాశారు. వివరాలు ఇవ్వకుంటే జీతం నిలిపివేస్తామని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఉపాధ్యాయులతో పాటు కార్పొరేషన్లు, అటానమస్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను చేర్చలేదు. చీఫ్ సెక్రటరీ ఆదేశాల తర్వాత కూడా ఆస్తుల వివరాలు ఇవ్వడంలో ఉద్యోగులు విముఖత చూపుతున్నారు. కేవలం 6.02 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే తమ ఆస్తులను వెల్లడించారు. సమాచారం ఇవ్వని ఉద్యోగులపై ఇప్పటికీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మరోసారి పాకిస్థాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్.. పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన బంగ్లా..
రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టును ఓడించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం ఇదే తొలిసారి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) లో బంగ్లాదేశ్‌కు ఇది 3వ విజయం కాగా.., ప్రస్తుత వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ రౌండప్ లో పాకిస్థాన్‌కి 5వ ఓటమి. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 274 పరుగులు చేసింది. లిటన్ దాస్ సెంచరీ (138) తో బంగ్లాదేశ్ 262 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ లో 12 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలింది. ఇందులో బంగ్లాదేశ్‌లో హసన్ మహమూద్ 5 వికెట్లు, నహిద్ రాణా 4 వికెట్లు తీశారు. జకీర్ హసన్ (40) ధాటికి బంగ్లాదేశ్ 185 పరుగుల విజయలక్ష్యాన్ని 4 వికెట్లను కోల్పోయి అందుకుంది. బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు WTC పాయింట్ల పట్టికలో 45.83 శాతంతో నాలుగో స్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్ ఈ రౌండప్ లో 3 మ్యాచ్‌లు గెలిచింది. అలాగే 3 మాత్రమే ఓడిపోయింది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును బంగ్లాదేశ్ టేబుల్ లో దాటేసింది. ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు 45 శాతంతో 5వ స్థానానికి పడిపోయింది. ప్రొటీస్ జట్టు 38.89 శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఇక WTC 2023-25లో పాకిస్తాన్ కేవలం 2 టెస్టులు గెలిచింది. అలాగే 5 ఓడిపోయింది. షాన్ మసూద్ సారథ్యంలోని ఈ జట్టు 19.05 శాతంతో పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఇక పాకిస్థాన్‌ కంటే దిగువన వెస్టిండీస్‌ జట్టు చివరి తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. WTC 2023-25లో కరీబియన్ జట్టు మొత్తం 9 టెస్టులు ఆడింది. ఇందులో 1 మ్యాచ్ గెలిచి 6 ఓడిపోయింది.

సినీ అవకాశం ఇప్పిస్తానని రేప్ చేశాడు.. నటుడిపై యువతి కేసు!!!
సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి సినీనటుడు బాబురాజ్‌ పిలిచి అత్యాచారం చేశారంటూ జూనియర్ ఆర్టిస్టు ఫిర్యాదు మేరకు ఆదిమాలి పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. తిర్కుకానంలోని రిసార్ట్‌లోనూ, ఎర్నాకులంలోని అతని ఇంట్లోనూ బాబురాజ్‌ తనపై వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు చీఫ్‌కు మహిళ ఇచ్చిన ఫిర్యాదును ఆదిమలి పోలీసులకు పంపించారు. మహిళ నుంచి ఫోన్‌లో సమాచారం అందుకున్న ఆదిమలి పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు యువతి బాబూరాజ్ రిసార్ట్‌లో మాజీ ఉద్యోగి. కేసు వివరాలను మరుసటి రోజు ప్రత్యేక దర్యాప్తు బృందానికి అందజేస్తామని ఆదిమలి పోలీసులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల వరదలు.. బాలయ్య కోటి విరాళం
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రదేశాలు వరదలతో విలవిలలాడుతున్నాయి. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్న క్రమంలో సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు తమకు తోచినంత విరాళం ఇస్తున్నారు. ఇప్పటికే ఆయ్ మూవీ యూనిట్, కల్కి నిర్మాతలు, ఎన్టీఆర్, విశ్వక్ సేన్, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ సహా పలువురు సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాలకు సహాయం అందించారు. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక స్పెషల్ నోట్ కూడా షేర్ చేశారు. 50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది, 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను అని ప్రకటించారు. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అంటూ ఆయన పేర్కొన్నారు.

కేరవాన్లో కెమెరాల కామెంట్స్.. రాధికకి మోహన్‌లాల్ ఫోన్!!
మలయాళ సినిమా సెట్స్‌ క్యారవాన్‌లలో సీక్రెట్ కెమెరాలతో నటీమణులను చిత్రీకరిస్తున్నారని కొన్ని రోజుల క్రితం సినీ నటి రాధికా శరత్‌కుమార్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆమె కామెంట్స్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ వార్తల తర్వాత, మోహన్‌లాల్ తనకు ఫోన్ చేసి సమాచారం కోరినట్లు రాధిక చెబుతోంది. చెన్నైలో జరిగిన కొత్త సీరియల్‌కి సంబంధించిన విలేకరుల సమావేశంలో రాధికా శరత్‌కుమార్ ఈ మేరకు కామెంట్ చేశారు. మోహన్‌లాల్ ఫోన్ చేశారని చెప్పారు. మోహన్‌లాల్‌ సార్‌ నాకు ఫోన్‌ చేసి నా సెట్‌లో ఇలా జరిగిందా అని అడిగారు. సార్‌.. పేరు చెప్పకూడదని చెప్పాను. మీ సెట్‌లో గానీ, ఎవరి సెట్‌లో గానీ అది జరిగింది. కానీ అది ఎవరి సెట్ అనేది బయటపెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పాను’’ అని రాధికా శరత్‌కుమార్ మీడియాకు తెలిపారు. తమిళ సినిమాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కూడా రాధిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళ సినిమా టాప్ స్టార్ యువ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె అన్నారు. ‘‘యువ నటిపై దాడి జరిగింది.. అప్పుడు నటుడు మద్యం మత్తులో ఉన్నాడు.. దీంతో ఆ నటుడిపై గట్టిగా అరిచా, తర్వాత ఆ అమ్మాయి నన్ను కౌగిలించుకుని నువ్వే కాపాడావు అని అన్నట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు ఆమె మాట్లాడిన భాష అర్ధం కాలేదు. ఇక ఆ అమ్మాయి ఇప్పటికీ నాకు మంచి స్నేహితురాలు అని రాధిక అన్నారు. రాజకీయ అజెండా ఉన్న నటీనటులు ముందుగా తమ సినీ పరిశ్రమలోని మహిళలకు రక్షణ కల్పించాలని రాధిక అన్నారు.