NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

వెలిగొండ ప్రాజెక్ట్‌పై మాట్లాడి అర్హత మీకు లేదు.. గొట్టిపాటి ఫైర్‌
వెలిగొండ ప్రాజెక్ట్ పై మాట్లాడే అర్హత మీకు లేదంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్‌ అయ్యారు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌.. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు.. ఆనాడు చంద్రబాబు సూచనలతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీ వెళ్లి వెలిగొండ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రిని కలిశామని గుర్తుచేసుకున్నారు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను వైఎస్‌ జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని వైఎస్‌ జగన్ అధోగతి పాలు చేశారన్న ఆయన.. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసిన చరిత్ర వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానిది అని దుయ్యబట్టారు. గుండ్లకమ్మ గేటు పోయి మూడు సంవత్సరాలైనా పెట్టలేని దుస్థితిలో నాటి వైసీపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వలన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది, పులిచింతల గేటు కొట్టుకుపోయింది. వైసీపీ నేతల ఇసుక దోపిడీతో ప్రాజెక్టుల భద్రతకు ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇక, వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్లపాటు నోరు తెరవక పోవటం మంచిది.. లేకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌.

నేడు కీలక శాఖలపై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష..
ఈ రోజు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యారణం శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పాల్గొంటారు.. రాష్ట్రంలో చేపట్టబోతున్న నరేగా పనులు, ఈ నెల 23వ తేదీన గ్రామసభల నిర్వహణపై ముఖ్యంగా సమీక్షించను్నారు.. గత ప్రభుత్వ హయాంలో నరేగా పనుల్లో అవినీతి ఏమైనా జరిగిందా అనే అంశం పైనా సమీక్షించే అవకాశం ఉంది.. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం, రిపేర్లపై సమీక్షలో ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి.. అటవీ, పర్యావరణం సమీక్షలో ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి, మొక్కల పెంపకం, అర్బన్ ఫారెస్ట్రీ వంటి అంశాలపై కీలక చర్చ సాగనుంది.. కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కి రప్పించడం, ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి వంటి అంశాలపై కర్ణాటక ప్రభుత్వంతో తాను జరిపిన చర్చల వివరాలను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడించనున్నారు.

మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి బహిరంగ లేఖ..
మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు గత కొంతకాలంగా హాట్‌ టాపిక్‌ అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్‌ పెట్టింది.. అక్రమ నిల్వలపై దాడి చేసి బయటపెట్టింది.. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఆరోపణలు వచ్చాయి.. అయితే, తనపై చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి.. ఈ మేరకు కాకినాడ ఎమ్మెల్యే కొండ బాబుకు బహిరంగ లేఖ రాశారు.. గత వారం రోజులుగా ఎస్పీ, కలెక్టర్ కి ద్వారంపూడి పై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కొండ బాబు.. అంతేకాదు. ఆయన అవినీతి పై విచారణ చేయాలని సీఎం చంద్రబాబును కలవడానికి సిద్ధమయ్యారు.. ఈ మొత్తం ఎపిసోడ్ పై స్పందించారు ద్వారంపూడి.. కక్ష సాధింపు చర్యలు.. నిరాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారని.. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.. అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.. ఇదే సమయంలో.. చట్టబద్ధంగా కేసులు ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.. తాను ఎటువంటి బియ్యం వ్యాపారం చేయడం లేదని. మీ వల్ల 30 వేల మంది కార్మికులు నష్టపోతున్నారని మండిపడ్డారు. అధికారుల బదిలీలలో ఎంత అవినీతి జరిగిందో త్వరలోనే బయటపెడతానని.. ఆరు నెలల తర్వాత అవినీతి అక్రమాలపై స్పందిస్తానని కౌంటర్‌ ఎటాక్‌ దిగారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. మొత్తంగా ఇప్పుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి.. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి రాసిన బహిరంగ లేఖ చర్చగా మారింది.

శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
శ్రీశైలం మహాక్షేత్రం మరోసారి చిరుత కలకలం సృష్టిస్తోంది.. ఈ మధ్య తరచూ చిరుతల సంచారంతో స్థానికులతో పాటు భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.. స్థానిక నీలం సంజీవరెడ్డి భవనం దిగువన ఉన్న గేటు వద్ద నిన్న రాత్రి చిరుత పులి సంచరించడం స్థానికంగా కలవరపెడుతుంది.. నిన్న రాత్రి నీలం సంజీవరెడ్డి భవన్ దిగువన గేటు ముందు చిరుతపులి నిలుచొని చూస్తున్న దృశ్యాలను కొందరు భక్తులు గమనించారు.. భక్తులు కారులో నుండి చూసి భయాందోళనకు గురయ్యారు. కారులోనే కూర్చొని చిరుతపులి గేటు ముందు ఉన్న దృశ్యాలను వారి సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.. అయితే, కారు లైట్లు వేసి వీడియోస్ తీస్తుండగా కారు లైట్లు వెలుతురు పడటంతో చిరుతపులి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అయితే, జన సంచారం చేసే ప్రాంతంలోకి చిరుతపులి రావడంతో ఒక్కసారిగా భక్తులు ఉలిక్కిపడ్డారు. తరచూ క్షేత్ర పరిధిలో ఎక్కడో ఒకచోట పలు ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తూనే ఉంది.. ఇక, ఈ విషయంపై అటవీశాఖ అధికారులు, దేవస్థానం అధికారులు స్పందించారు.. చిరుత పులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.. మరోపక్క అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉండడంతో చిరుతలు క్షేత్రం పరిధిలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ భక్తులకు, స్థానికులకు తారసపడడం పరిపాటిగా మారింది..

కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కవిత బెయిల్‌పై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసినా.. ఈడీ చేయలేదు. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం ఇవ్వాలని వారు ధర్మాసనాన్ని కోరగా, ఈడీ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. శుక్రవారం లోపు కవిత తరఫున న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వచ్చే మంగళవారానికి ఆగస్ట్ 27 కు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసి, మార్చి 16న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

విగ్రహంపై చేయి వేసి చూడు.. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..
సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి వేయండి.. అంటూ కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విగ్రహార్క, ఇన్చార్జి దీపా దాస్ మున్షీ నివాళి అర్పించారు. అనంతరం కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని మండిపడ్డారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనని అనుకుంటున్నారని తెలిపారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదన్నారు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు..చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి వేయండి.. అని హెచ్చరించారు.

నిండు కుండలా హుస్సేన్ సాగర్ జలాశయం..
నిన్నటి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ లో నీటిమట్టం పెరిగింది. ఎఫ్డిఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం వరకు 513.60 మీటర్లకు వాటర్ లెవెల్ చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు హుస్సేన్ సాగర్ జలాశయం నిండు కుండలా తలపిస్తుంది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు పై నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల సందర్భంగా దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ లెవెల్ ను హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి పరిశీలించారు. నగరంలో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ లో నీటి ఉదృతి పెరిగిందన్నారు. వరద ఉధృతి పెరగడంతో ఎఫ్టీఎల్ లెవెల్ ను మించి వరద నీరు చేరిందనిత తెలిపారు. ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 ఉండగా ప్రస్తుతం 513.60 చేరింది. వరద ఉధృతి పెరగడంతో హుస్సేన్ సాగర్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. దిగువ ప్రాంతాల్లో కూడా ప్రజలను అధికారులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఎమర్జెన్సీ టీం లను అలెర్ట్ గా ఉంచామని వెల్లడించారు. రామ్ నగర్ లో జరిగిన జరిగిన సంఘటన పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇంకెక్కడా అలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు.

ఆస్పత్రులు, డాక్టర్ల భద్రతపై నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు..
కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, ఈ రోజు విచారించింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం, బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం, పోలీసుల అలసత్వంపై విరుచుకుపడింది. ఇదిలా ఉంటే డాక్టర్లు, ఆస్పత్రుల భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను, రెండు నెలల్లో తుది నివేదికను సమర్పించాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టిఎఫ్)ని ఆదేశించినట్లు కోర్టు పేర్కొంది. టాస్క్‌ఫోర్స్‌లో వివిధ విభాగాలకు వైద్యులను కలిగి ఉంటారని, వారు “భద్రతను నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన విధానాలను మాకు తెలియజేస్తారని” ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల భద్రత, రక్షణను నిర్ధారించడానికి మేము ఇక్కడ ఉన్నామని చంద్రచూడ్ అన్నారు. ఇది అత్యున్నత జాతీయ ఆందోళనగా అభివర్ణించారు. దేశం మరో అత్యాచారం, హత్య కోసం వేచి ఉండదని ఆయన అన్నారు. న్యాయమూర్తులు జెబి పార్దివాలా మరియు మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది.

తెల్లవారుజామున ఘటన, రాత్రి 11.30 గంటలకు ఎఫ్ఐఆర్.? కోల్‌కతా వైద్యురాలి ఘటనపై సుప్రీం సీరియస్..
కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులో ఆర్‌జి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న దారుణమైన అత్యాచారం జరిగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రెకెత్తించింది. ‘‘పాతుకుపోయిన పితృస్వామ్య పక్షపాతం కారణంగా మహిళా వైద్యులు ఎక్కువగా లక్ష్యమవుతున్నారు. వైద్యవృత్తులు హింసకు గురవుతున్నాయి. ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరినందున, పరిస్థితులు మారడం కోసం దేశం మరొక అత్యాచారం కోసం వేచి ఉండదు’’ అని చంద్రచూడ్ అన్నారు. అయితే, ఈ కేసులో బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆలస్యం చేయడంపై, కేసుని నిర్వహించడంతో నిర్లక్ష్యం, లోపాలపై బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వం, ఆస్పత్రి అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ పోలీసుల చర్యలకు సంబంధించి అనేక ముఖ్యమైన ప్రశ్నల్ని లేవనెత్తారు. మృతదేహానికి దహన సంస్కారాలకు అప్పగించిన మూడు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు..? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

రాష్ట్రపతి భవన్‌లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు ప్రధాని మోదీ స్వాగతం..
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా స్వాగతం పలికారు. మలేషియా ప్రధాని భారత పర్యటన సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం పోజులిచ్చిన ఫోటోలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ Randhir Jaiswal ఈరోజు పంచుకున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం దేశ పర్యటన నిమిత్తం సోమవారం దేశ రాజధానికి చేరుకున్నారు. మలేషియా ప్రధానమంత్రిగా ఆయన భారత్‌ లో పర్యటించడం ఇదే తొలిసారి. విమానాశ్రయంలో ప్రధాని ఇబ్రహీంకు కేంద్ర సహాయ మంత్రి వి. సోమన్న ఘనస్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ప్రధాని ఇబ్రహీం భారత్‌కు వస్తున్నారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఢిల్లీలోని రాజ్‌ ఘాట్‌లో మహాత్మా గాంధీకి మలేషియా ప్రధాని నివాళులర్పించారు. రాజ్‌ ఘాట్‌ లో సందర్శకుల పుస్తకంపై ఇబ్రహీం సంతకం కూడా చేశారు.

నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఇదే.. డెస్టినేషన్ వెడ్డింగ్‌ అక్కడే!
సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు తెర మీదకు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక నాగచైతన్య, శోభిత పెళ్లి ముహూర్తం సహా ఎక్కడ చేసుకోబోతున్నారు? అనేది కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 8న చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున నివాసంలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య గ్రాండ్ గా జరిగింది. నాగ చైతన్య – శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కాకుండా ఏదైనా బయట ప్రదేశంలోనే వీరి వివాహం జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రాజస్థాన్‌, లేదా మధ్యప్రదేశ్ లాంటి చోట్ల రాయల్ స్టైల్ లో వీరి వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ కుదరని పక్షంలో విదేశాల్లో సైతం చేసుకునే ఆలోచన ఉన్నట్టుగా సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో నాగ చైతన్య, శోభితల వివాహం చేసుకునేందుకు కొన్ని ముహూర్తాలు కూడా సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ లోపు నాగ చైతన్య, శోభితల సినిమాల షూటింగ్స్ కూడా పూర్తవుతాయని డేట్స్ ఇబ్బందులు లేకుండా చూసుకున్న తరువాతే వాళ్ళు పెళ్లి విషయం మీద ఫోకస్ చేయబోతున్నారని చెబుతున్నారు. అయితే ఇదంతా ప్రచారమే కాగా నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది అక్కినేని కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు.

‘ప్రేమ’ గురించి సమంత కీలక ప్రకటన?
సమంత, నాగచైతన్య ఒకప్పుడు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ మూడేళ్ల క్రితం విడిపోయారు. విడిపోయినప్పటి నుంచి తప్పు ఎవరిది అనే అంశం మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నాగచైతన్య అభిమానులు తప్పు సమంతదేనని సమంత అభిమానులు, తప్పు నాగచైతన్యదని రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కానీ అది వారి వ్యక్తిగత విషయం. అయితే నాగచైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఈ అంశం గురించి మళ్లీ చర్చిలు మొదలయ్యాయి. మరో పక్క సమంత ఏకంగా ఒక డైరెక్టర్ తో డేటింగ్ చేస్తోందని కాదు కాదు ఏకంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే సమంత తన సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ఈ పోస్టులు పెడుతుందా? లేక ఆమె చేస్తున్న పలు బిజినెస్లకి సంబంధించిన పోస్టులు పెడుతుందా అనే విషయం మీద అయితే చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆమె ఒక ఇంస్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. అందులో ఈరోజు కొంచెం స్పెషల్ మీ ముందుకు రాబోతోంది స్టేట్ ట్యూన్ అంటూ రాసుకొచ్చింది. కింద వాడిపోయిన ఆకులకు సంబంధించిన ఒక ఫోటో కూడా పెట్టడం అనేక చర్చలకు తావిస్తోంది. ఆమె తన బిజినెస్ అప్డేట్ ఏదైనా ఇస్తోందా? లేక పర్సనల్ లైఫ్ అప్డేట్ ఏమైనా ఇస్తోందా? అనే అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి. నాగచైతన్య ఎలా అయితే తాను శోభితను నిశ్చితార్థం చేసుకున్నాను అని ప్రకటించాడో సమంత కూడా అలా ఏమైనా ప్రకటిస్తుందా అనే చర్చ జరుగుతోంది. మీ ఉద్దేశం ఏంటో తెలియజేయండి