‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న సినిమా ‘ఎఫ్ 3’. 2019లో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని ఓ చిన్న ఫన్నీ వీడియో ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!
వస్తే, కొద్దిగా ముందుగా. వెళ్ళినా కొద్దిగా వెనకగా! థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా!’ అంటూ ఈ వీడియోతో పాటు పేర్కొంది. నిజానికి ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ సినిమాను పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ కోసమని ఏప్రిల్ 28కి పోస్ట్ పోస్ చేశారు. ఇప్పటికైతే అదే తేదీకి విడుదల చేయాలన్నది నిర్మాత ప్లాన్. అయితే ఏ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని నేపథ్యంలో వస్తే కాస్తంత ముందైనా రావచ్చని, లేదంటే కొద్దిగా వెనక్కి వెళ్లొచ్చని, కానీ థియేటర్లలో విడుదల మాత్రం పక్కా అని చిత్ర బృందం హామీ ఇస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
ఎఫ్ 3′ షూటింగ్ పూర్తి… ముందో వెనకో థియేటర్లలో పక్కా!
