ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “చిత్రం” నేటితో 21 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతోనే ఆయన ఉదయ్ కిరణ్, రీమాసేన్ లను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ తో తేజ చేసిన ప్రయత్నం సక్సెస్ ఫుల్ అయ్యింది.
ఒక మధ్య తరగతి యువకుడు, ఆధునిక భావాలున్న యువతి ప్రేమలో పడతారు. కాలేజీలో చదువుతుండగానే హీరోయిన్ గర్భవతి అవుతుంది. కానీ ఆ గర్భాన్ని తొలగించుకోవడానికి ఆమె ఒప్పుకోదు. దీంతో హీరోహీరోయిన్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత బిడ్డ పుట్టడంతో… పసిపాపతోనే కాలేజీకి హాజరవుతారు ఆ జంట. మరోవైపు హీరోకు చదువుకుంటూ వారిని పోషించడం కష్టంగా మారుతుంది. ఒకానొక సమయంలో హీరోయిన్ ను హీరో విసుక్కోవడంతో… ఆమె బిడ్డను అక్కడే వదిలేసి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఏం జరిగింది ? వాళ్ళు ఎలా కలుసుకున్నారు ? అనే విషయాలను తేజ ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూస్తుంటే ఆ పరిస్థితులను డైరెక్టుగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. చదువుకునే రోజుల్లోనే ఆలోచన లేకుండా తొందరపడి ప్రేమ, పెళ్ళి అంటే… తరువాత ఆ ప్రేమికులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలను తేజ కళ్ళకు కట్టినట్టు చక్కగా చూపించారు.
ఆర్పి పట్నాయక్ అందించిన సంగీతం ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. “ఢిల్లీనుండి గల్లీదాక, మావో మావో, ఏకాంత వేళ ఈ కాంత సేవ, చీమలు దూరని, ఊహల పల్లకిలో, కుక్క కావాలి” సాంగ్స్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదల కాగా… ఆ సమయంలో ఎక్కడ చూసినా ముఖ్యంగా “ఢిల్లీనుండి గల్లీదాక, మావో మావో సాంగ్స్” బాగా విన్పించేవి.
ఈ చిత్రం అందరికీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చింది. తేజకు, ఉదయ్ కిరణ్, రీమా సేన్ కు “చిత్రం” వారి కెరీర్ లో మరిచిపోలేని హిట్ ను ఇచ్చింది. ఆ తరువాత ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన మన మధ్య లేకపోయినా… తన సినిమాల ద్వారా ఎప్పటికీ అభిమానుల గుండెల్లో బ్రతికే ఉంటారు. హీరోయిన్ రీమా సేన్ కూడా ఆ తరువాత పలువురు స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. దర్శకుడు తేజ లైట్ అసిస్టెంట్ నుంచి సినిమాటోగ్రాఫర్ గా, స్క్రీన్ రైటర్ గా… ఆ తరువాత దర్శకుడిగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన “చిత్రం” చిత్రానికి సీక్వెల్ గా “చిత్రం 1.1″ను రూపొందించే పనిలో ఉన్నారు.