సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన ఒక గర్భిణికి, అక్కడ సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న నర్సు , ఆయా కలిసే డెలివరీ (కాన్పు) చేశారు. అయితే, కాన్పు పూర్తయిన తర్వాత పుట్టిన నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమంగా మారింది. ఆ సమయంలో ఆసుపత్రిలో శిశువుకు అత్యవసరంగా పెట్టడానికి కనీసం ఆక్సిజన్ సిలిండర్ కూడా అందుబాటులో లేకపోవడంతో, ఊపిరాడక పరిస్థితి మరింత విషమించి ఆ పసికందు ప్రాణాలు విడిచింది.
సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది , వైద్యుల ఘోర నిర్లక్ష్యం వల్లే తమ ముద్దుల బిడ్డ మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట భారీ ఆందోళనకు దిగారు. అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం, ప్రాణాలు కాపాడే కనీస ఆక్సిజన్ సదుపాయం కూడా లేకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యులైన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

