దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సీఈసీ వెల్లడించింది. ఈ మేరకు వైఎస్ఆర్టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖను పంపింది. తమ పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్టుగా తమకు లేఖ అందినట్లు పార్టీ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్ ప్రకటించారు. తమ పార్టీని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ 28 డిసెంబరు 2020లో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశామని రాజగోపాల్ తెలిపారు.
అటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు కోసం షర్మిల తల్లి విజయలక్ష్మి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించారు. కానీ కొన్ని కారణాల వల్ల పార్టీ పేరు రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉంటూ వచ్చింది. తాజాగా ఈసీ గుర్తించడంతో ఈ నెల 16 నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి రాజకీయ గుర్తింపు లభించినట్టు అయింది. ప్రస్తుతానికి మాత్రం ఈ పార్టీకి వాడుక రాజగోపాలే అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో త్వరలోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షురాలిగా షర్మిల పేరును ఆమోదించి ఎన్నికల సంఘానికి పంపనున్నట్టు తెలుస్తోంది.
కాగా తండ్రి వైఎస్ఆర్ మాదిరిగానే వైఎస్ షర్మిల కూడా ప్రజా ప్రస్థానం పేరుతో ప్రజ సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టారు. అలాగే నిరుద్యోగ నిరహార దీక్ష, రైతు వేదన దీక్ష కూడా షర్మిల శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ ఇమేజ్ ను తెలంగాణలో తన పార్టీకి రాబట్టుకునేలా షర్మిల అడుగులు వేస్తున్నారు. అందుకే ప్రతి సమావేశంలోనూ ఇప్పుడు రాజన్న ఉండి ఉంటే ఏఏ పథకాలు ఉండేవో ప్రజలకు వివరిస్తున్నారు.