NTV Telugu Site icon

బంగారు తెలంగాణలో పెంచని చార్జీలు లేవు.. వారిని కూడా వదలడంలేదు..!

తెలంగాణ వరుసగా అన్ని చార్జీలు పెరుగుతుండడంపై సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాజాగా విద్యుత్‌ చార్జీల పెంపుపై ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆమె.. సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.. వైఎస్‌ఆర్ హయాంలో ఏ రోజు కూడా ఆర్టీసీ చార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, విద్యుత్ చార్జీలు కానీ పెరిగింది లేదని ట్వీట్‌లో పేర్కొన్న ఆమె.. బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవంటూ మండిపడ్డారు.. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచి, ఇప్పుడు కరెంటు చార్జీల భారం మోపారని ఆరోపించారు. 50 యూనిట్ల లోపు వాడుకునే 40 లక్షల పేదలను కూడా వదలకుండా ముక్కు పిండి చార్జీలు వసూలు చేస్తున్నాడని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఇక, ఏడాదికి 6,800 కోట్ల లోటును పూడ్చుకునేందుకు సామాన్యుడిపై కరెంట్ భారాన్ని మోపారంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు వైఎస్‌ షర్మిల.. దూకుడు ఖర్చులకు, దొర పోకడలకు, తెచ్చిన అప్పుల మీద మిత్తికి మిత్తి.. ప్రజల నుంచే వసూలు చేస్తున్నారని ఆరోపించిన ఆమె.. జనానికి కరెంట్ షాక్ ఇచ్చిన టీఆర్ఎస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి షాక్ ఇచ్చేందుకు ప్రజలు రెడీగా ఉండాలంటూ ట్విట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు.