NTV Telugu Site icon

యాదాద్రి: అడ్డ‌గూడూరు పీఎస్‌లో మ‌హిళ లాక‌ప్ డెత్..!

Addagudur PS

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాక‌ప్‌డెత్ సంచ‌ల‌నంగా మారింది.. పోలీసు దెబ్బలు తట్టుకోలేక మ‌రియ‌మ్మ అనే మ‌హిళ మృతిచెందిన‌ట్టుగా తెలుస్తోంది.. ఇది ముమ్మాటికీ లాకప్ డెత్ అని మ‌రియ‌మ్మ కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తి.. అడ్డగూడూరు మండలంలోని గోవిందాపురంలో ఫాదర్ బాలశౌరి ఇంట్లో రూ.2 లక్షలు చోరికీ గురయ్యాయి. పనిమనిషి మీద అనుమానంతో పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశాడు పాస్ట‌ర్.. మొదట మరియమ్మ, ఆత‌ర్వాత ఆమె కొడుకు ఉదయ్‎ను అరెస్ట్ చేశారు పోలీసులు.. విచారణలోభాగంగా తల్లి, కొడుకుని పోలీసులు విచక్షణారహితంగా కొట్టార‌ని ఉద‌య్ స్నేహితుడు శంక‌ర్ ఆరోపిస్తున్నాడు.. అడ్డుకోవ‌డానికి య‌త్నించిన త‌న‌ను కూడా పోలీసులు చిత‌క‌బాదార‌ని శంక‌ర్ చెబుతున్నారు.. ఇక‌, పోలీసుల దెబ్బలు తాళలేక మరియమ్మ స్పృహ తప్పి పడిపోయింద‌ని.. వెంటనే ఆమెను మండలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి త‌ర‌లించార‌ని.. ఆమె ప‌రిస్థితి విష‌మ‌యంగా ఉండ‌డంతో.. అక్క‌డి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టుగా తెలుస్తోంది.. పోలీసులు కొట్ట‌డంతోనే మ‌రియ‌మ్మ చ‌నిపోయింద‌ని ఆమె కుటుంస‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు.. ఇక‌, పోస్టుమార్టం నిమిత్తం మ‌రియ‌మ్మ మృత‌దేహాన్ని ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు.