ఉమ్మడి మెదక్ జిల్లాలో ‘ఎల్నినో’ ప్రభావం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ఎండిపోయి తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటిపోవడంతో అటు వ్యవసాయ రంగం, ఇటు తాగునీటి వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఎప్పుడూ జలకళతో ఉట్టిపడే ప్రాజెక్టులు నేడు వెలవెలబోతూ కనిపించడం స్థానిక ప్రజలను, రైతులను కలవరపెడుతోంది.
మూడు పంటలుగా మూలనపడ్డ నాగలి.. బీడువారిన భూములు
వర్షాలు ముఖం చాటేయడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సాగు నీరు అందక రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోంది. ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేక పంట కాలువలు ఎండిపోవడంతో రైతులు పంటలు వేయలేక చేతులెత్తేశారు. గడిచిన మూడు పంట కాలాలుగా రైతులు తమ సాగు భూములను వేయకుండా బీడుగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. జలాశయాల ఆధారంగా సాగయ్యే ఆయకట్టు ప్రాంతాలు ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్నాయి.
అడుగంటిన ప్రాజెక్టులు.. నగరానికీ తప్పని తాగునీటి ముప్పు
జిల్లాలోని జలాశయాలు కేవలం స్థానిక గ్రామాలకే కాకుండా, హైదరాబాద్ నగరానికి కూడా ప్రధాన తాగునీటి ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు సింగూరు, మంజీరా బ్యారేజీలు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకోవడంతో రాబోయే రోజుల్లో రాజధాని నగరంతో పాటు స్థానిక ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. సాధారణంగా ఈ సమయానికి 17 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సిన సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 4 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి, అది కూడా వాడుకోలేని డెడ్ స్టోరేజ్ మట్టంలో ఉంది. ఇక మంజీరా బ్యారేజ్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. చుక్క నీరు లేక ప్రాజెక్టులో ఇసుక మేటలు వేసి, గడ్డి మొలిచింది. వీటితో పాటు ఘనపురం, హల్దీవాగు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి.
ఇంటేక్ వెల్స్తో అత్యవసర చర్యలు.. మిషన్ భగీరథపై భారం
ఈ తీవ్ర నీటి కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోకుండా ఉండేందుకు సింగూరు ప్రాజెక్టు వద్ద ప్రత్యేకంగా ఇంటేక్ వెల్స్ (Intake Wells) ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రాజెక్టు అడుగున ఉన్న తక్కువ నీటిని , భూగర్భ జలాలను తోడి, వాటిని శుద్ధి చేసి ‘మిషన్ భగీరథ’ పథకం ద్వారా ప్రజలకు అందించేందుకు యత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఇలాగే ఉంటే నీటి సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

