DGP Anand : తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ప్రధాన సవాలుగా ఉన్న నక్సలిజం పూర్తిగా అంతరించిందని, ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ , సైబర్ నేరాలే అతిపెద్ద సమస్యలుగా పరిణమించాయని రాష్ట్ర డీజీపీ ఆనంద్ స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్ నిట్ (NIT) ప్రాంగణంలో పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, తన ఐపీఎస్ శిక్షణ వరంగల్లోనే జరిగిందని, అప్పట్లో నక్సలైట్ల భయాలు, దాడులు , కూంబింగ్ ఆపరేషన్లతో కాలం గడిపామని తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం.. టీజీ వీర్ యాప్ ప్రారంభం
అదృష్టవశాత్తూ రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా సమసిపోయిందని, కీలక నేతలతో పాటు క్యాడర్ కూడా లొంగిపోయిందని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పాలసీ ప్రకారం సహాయం అందించి పునరావాసం కల్పించడమే తమ ముందున్న తదుపరి సవాలని చెప్పారు. అలాగే మావోయిస్టు దాడుల్లో మృతిచెందిన బాధిత కుటుంబాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ‘టీజీ వీర్’ (TG Veer) అనే ప్రత్యేక అప్లికేషన్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇక గతంలో నక్సలైట్ల సమస్య కారణంగా రాజకీయ నాయకులకు ఇచ్చిన సెక్యూరిటీపై ప్రస్తుతం రివ్యూ జరుగుతోందని, అవసరం లేని వారికి భద్రత తగ్గించామని వివరించారు. దీనిని ఎవరూ రాజకీయం చేయకూడదని, ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడటంలో భాగంగానే స్వయంగా తాను కూడా తన సెక్యూరిటీని తగ్గించుకున్నానని పేర్కొన్నారు.
సైబర్ క్రైమ్స్, డ్రగ్స్పై కఠిన చర్యలు.. విద్యాసంస్థలకూ బాధ్యత
సమాజంలో ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ, ట్రాఫిక్ , ఆర్థిక నేరాలు ప్రధాన సమస్యలుగా మారాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులు అధిక లాభాల ఆశతో సైబర్ నేరగాళ్ల బారినపడి రూ.1,750 కోట్లు కోల్పోయారని, వీరిలో వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఐతే సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. డ్రగ్స్ సమస్య పట్టణాల నుంచి గ్రామాలకు పాకుతోందని, విద్యాసంస్థల్లో మత్తు పదార్థాలు తీసుకునే వారిని తాము గుర్తిస్తున్నప్పటికీ యాజమాన్యాలు సరిగా స్పందించడం లేదని, దీనిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్లు, సోషల్ మీడియా అడిక్షన్ వల్ల నేరాలు పెరుగుతున్నాయని, వీటి నియంత్రణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని డీజీపీ తెలిపారు.

