Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం

  • రెండు రైస్ మిల్లులపై జిల్లా యంత్రాంగం కొరడా
  • రూ.52 కోట్లకు పైగా సివిల్ సప్లై బకాయిలు
  • అనుమతులు లేకుండా నిర్వహణపై అధికారులు సీరియస్
  • బుల్డోజర్లతో మిల్లులను నేలమట్టం చేసిన అధికారులు
Rice Mill

Rice Mill

Government Action : వనపర్తి జిల్లాలో సివిల్ సప్లై రంగానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తూ, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల బకాయిలు పడిన రైస్ మిల్లులపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు పూనుకుంది. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించి నిర్వహిస్తున్న చాముండి రైస్ మిల్ , సాంబశివ రైస్ మిల్లులను అధికారులు శనివారం కూల్చివేశారు. సివిల్ సప్లైస్ శాఖ, రెవెన్యూ విభాగం , ఇతర అధికారుల ఉమ్మడి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించి బుల్డోజర్లతో మిల్లు నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లకు ఈ చర్య ద్వారా అధికారులు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

రూ.52 కోట్ల బకాయిలు.. మిల్లర్ల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు

ప్రభుత్వానికి చెల్లించాల్సిన సివిల్ సప్లై (CMR) బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు ఎంత ప్రయత్నించినప్పటికీ రైస్ మిల్లుల యజమానులు ఏమాత్రం స్పందించలేదు. విచారణలో భాగంగా సాంబశివ రైస్ మిల్ ప్రభుత్వానికి రూ. 13 కోట్ల పైచిలుకు బకాయి పడగా, చాముండి రైస్ మిల్ ఏకంగా రూ. 39 కోట్ల మేర బకాయి పడినట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం రూ.52 కోట్లకు పైగా మొండిబకాయిలను చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించడమే కాకుండా, కనీస అనుమతులు లేకుండా మిల్లులను నిర్వహించడంతో జిల్లా యంత్రాంగం చట్టపరమైన చర్యలను వేగవంతం చేసింది. రెవెన్యూ శాఖ సహకారంతో ఈ రెండు మిల్లులను పూర్తిగా కూల్చివేసి, బకాయిల రికవరీ దిశగా తదుపరి చర్యలు చేపట్టారు.