Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!

  • హైకోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలి
  • ఫీజు బకాయిలతో విద్యార్థులు ఇబ్బంది పడొద్దు
  • ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలు
  • నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం కావాలి
Vijayashanti

Vijayashanti

Vijayashanthi : ప్రైవేట్ కాలేజీల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలను గౌరవించి, వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ఫీజుల బకాయిల కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారి విద్యా సంవత్సరానికి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు.

ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు

విద్యార్థుల నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల తీరుపై విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజులు వసూలు చేసే కాలేజీలు కనీస విద్యా ప్రమాణాలను , వసతులను ఖచ్చితంగా పాటించాలన్నారు. గతంలో విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికల ఆధారంగా, కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

నాణ్యమైన విద్యే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి

ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సద్వినియోగం అయ్యేలా, అర్హులైన విద్యార్థులకు తగిన న్యాయం జరిగేలా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజయశాంతి కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ మెరుగైన వసతులతో కూడిన, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆమె ప్రభుత్వానికి హితవు పలికారు.