Congress: తుంగతుర్తి కాంగ్రెస్‌ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!

  • జగ్గారెడ్డితో ఎమ్మెల్యే సామెల్ భేటీ
  • మండల అధ్యక్షుల నియామకంపై చర్చ
  • ఎమ్మెల్యేకు 15వ తేదీ వరకు గడువు
  • 17న పూర్తి క్లారిటీ ఇవ్వనున్న సామెల్
Congress

Congress

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తుంగతుర్తి నియోజకవర్గ వివాదానికి ఎట్టకేలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. వివాదాల పరిష్కారానికి ఏఐసీసీ (AICC) నియమించిన పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డితో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆదివారం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు, మండల అధ్యక్షుల నియామకంపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. భేటీ అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారాన్ని ‘ఇద్దరు అన్నదమ్ముల మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు’గా అభివర్ణించారు. నియోజకవర్గంలో అక్కడక్కడా కొన్ని గొడవలు జరిగిన మాట వాస్తవమేనని, అయితే వాటన్నింటినీ సద్దుమణిగేలా చూస్తామని స్పష్టం చేశారు.

మండల అధ్యక్షుల నియామకం.. ఎమ్మెల్యే అప్పీల్

ఏఐసీసీ ఆదేశాల మేరకే తుంగతుర్తి నియోజకవర్గంలో 9 మంది మండల అధ్యక్షుల నియామకం జరిగిందని జగ్గారెడ్డి వివరించారు. అయితే ఇందులో 3 మండలాల నియామకాల్లో కొంత తేడాలు ఉన్నాయని, కొందరు నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిపారు. “ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నేనే స్వయంగా చక్కదిద్దుకుంటానని, తనకు కొంత సమయం ఇవ్వాలని ఎమ్మెల్యే మందుల సామెల్ ఏఐసీసీ, పీసీసీ (PCC) లకు అప్పీల్ చేసుకున్నారు. ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తిని నేను పీసీసీ అధిష్టానానికి నివేదిక రూపంలో అందిస్తాను” అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవరి ప్రాధాన్యత ఎలా ఉంటుందో స్పష్టం చేస్తూ.. ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గంలో ఎమ్మెల్యేకే మొదటి అధికారం ఉంటుందని, స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి రెండవ అభిప్రాయం (ప్రాధాన్యత) ఉంటుందని, అలాగే జిల్లా నాయకుల పక్షాన డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఉంటారని తేల్చి చెప్పారు.

సీనియర్లకు గౌరవం ఇవ్వాలి.. ఎవరి ప్రభావం లేదు

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను తాము ఎల్లప్పుడూ గౌరవించుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. అయితే తుంగతుర్తి అంతర్గత వ్యవహారాల్లో వారెవరూ జోక్యం చేసుకోలేదని (ఇవాల్వ్ కాలేదని) స్పష్టం చేశారు. తనను కూడా ఈ విషయంలో ఎవరూ ప్రభావితం చేయలేదని, నిష్పక్షపాతంగానే అందరి అభిప్రాయాలను సేకరించానని తెలిపారు. గత పది రోజులుగా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో నియోజకవర్గ నేతలందరి భావాలను, అసంతృప్తులను తాను స్వయంగా నోట్ చేసుకున్నానని.. ఈ రోజుతో తుంగతుర్తిలో గొడవలకు స్వస్తి పలకాలని నేతలకు గట్టిగా హితవు పలికారు.

16న ఫైనల్ రిపోర్ట్.. 17న క్లారిటీ

ఈ పంచాయితీని పూర్తిగా సెట్ చేయడానికి ఎమ్మెల్యే మందుల సామెల్ ఈ నెల 15వ తేదీ వరకు సమయం అడిగారని జగ్గారెడ్డి వెల్లడించారు. “వచ్చే గురువారం (ఈ నెల 16వ తేదీ) సాయంత్రం నేను, ఎమ్మెల్యే మందుల సామెల్, పీసీసీ చీఫ్, బసవరాజు సారయ్య కలిసి కూర్చుని తుది చర్చలు జరుపుతాం. ఆ తర్వాత పూర్తి నివేదికను అధిష్టానానికి సమర్పిస్తాం. అనంతరం, ఈ నెల 17న ఎమ్మెల్యే సామెల్ స్వయంగా మీడియాతో మాట్లాడి అన్ని విషయాలపై పూర్తి స్పష్టత ఇస్తారు” అని జగ్గారెడ్డి ప్రకటించారు. దీంతో గత కొద్దిరోజులుగా తుంగతుర్తి కాంగ్రెస్‌లో నడుస్తున్న హైడ్రామాకు త్వరలోనే శుభం కార్డు పడనుందని అర్థమవుతోంది.