Site icon NTV Telugu

TS RTC: ఆర్టీసీకి రవాణా శాఖ షాక్..

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి రవాణా శాఖ షాక్ ఇచ్చింది. దీంతో.. బస్సుల సంఖ్య మరంత తగ్గిపోనుంది.. నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సులను నడపొద్దంటూ రవాణా శాఖ ఇచ్చిన నోటీస్‌లతో బస్సుల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. గత ఏడాది లెక్కల ప్రకారం 97 డిపోల పరిధిలో 9,708 బస్సులు తిరిగాయి. ఇందులో 3,107 అద్దె బస్సులున్నాయి. కాలంచెల్లినందున సంస్థ సొంత బస్సుల్లో కాలంచెల్లిన 600 బస్సులను పక్కనబెట్టనున్నారు. వాటి స్థానంలో 500 ఎలక్ట్రికల్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

Read Also: Telangana: హైకోర్టుకు 10 మంది కొత్త న్యాయమూర్తులు..

సంస్థకు ఉన్న బస్సులు, వాటి కండిషన్‌పై రివ్యూ చేశారు ఎండీ సజ్జనార్‌. మొత్తం 97 డిపోల వారీగా మొత్తం బస్సులు, తిరుగుతున్న రూట్లు, సిబ్బంది, ఆదాయం, నష్టంతో పాటుగా డిపోకు ఉన్న భూముల గురించి సమగ్రంగా వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. లాభ, నష్టాల ఎజెండా ప్రాతిపదికగానే… సజ్జనార్‌ ఈ రివ్యూలు చేసినట్టు సమాచారం. 97 డిపోలు కూడా నష్టాల్లోనే ఉన్నాయని, కొన్నింటిలో నష్టాలు మూడింతలుగా ఉన్నట్టుగా తేలింది. ఫలితంగా మొదట కొన్ని డిపోలను మూసేసి అక్కడి సిబ్బందిని వేరే డిపోల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరుట్ల లేదా మెట్‌పల్లి, హుజురాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ -2 లేదా హన్మకొండ డిపో, ఘన్‌పూర్, నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి డిపోలను మూసేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ డిపోలకు చెందిన బస్సులను ఈ మధ్యే పక్క డిపోలకు పంపించారు. అలాగే ఒక్కో డిపోలో కనీసం 121 బస్సులు ఉండాల్సి ఉండగా 80కి తగ్గించారు. వీటిలో కాలంచెల్లిన బస్సులు సగంవరకు ఉన్నాయని కార్మికులంటున్నారు. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్-3, మియాపూర్ డిపోలను మూసేశారు. ఈ మధ్యే పికెట్ డిపో క్లోజ్ అయినట్టు సమాచారం. ఎక్కువ నష్టాలు వస్తున్న 17 డిపోలను మొదటివిడతలో మూసేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా నష్టాలు, కాలం చెల్లిన బస్సులు, రవాణా శాఖ నిబంధనలు తెలంగాణ ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు వేస్తున్నాయి.

Exit mobile version