NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది, ఇది రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ అమలును సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన విధానం. ముఖ్యంగా, ఎస్సీ వర్గీకరణపై సమగ్ర నివేదిక అందించేందుకు ఒక వ్యక్తితో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఈ నివేదిక ఆధారంగా కుద్రింపు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. 2011 జనాభా లెక్కలను ఈ కమిషన్ పరిశీలించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. దీంతో, ఈ నెలలోనే కమిషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు 24 గంటల్లో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఎందుకురా ఇలా చేస్తున్నారు.. మరోమారు రైలును పట్టాలు తప్పించే ప్రయత్నాలు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఇక్కడ రైలు పట్టాలపై ఇనుప రాడ్‌ పెట్టి రైలును బోల్తా కొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ విషయంపై రైల్వే, గ్వాలియర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన గురించి బిర్లా నగర్ రైల్వే స్టేషన్, గ్వాలియర్ రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించారు రైలు సంబంధిత అధికారులు. రైల్వే సిబ్బందితో పాటు గ్వాలియర్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు మొత్తం కేసును దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి గుర్తు తెలియని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక మరోవైపు ప్యాసింజర్ రైలును పట్టాలు తప్పించే కుట్రలో భాగంగా.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ దగ్గర జగత్‌పూర్-దరియాపూర్ స్టేషన్ మధ్య బెనికామా గ్రామ సమీపంలో సిమెంట్ స్లీపర్‌ను పూడ్చిపెట్టారు. అయితే., ప్యాసింజర్ రైలు కంటే ముందే గూడ్స్ రైలు వచ్చింది. ఇది గమనించిన లోకో పైలట్‌ బ్రేక్‌ వేసి రైలును నిలిపివేశాడు. దింతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయంలో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఝాన్సీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ప్రయాగ్‌రాజ్ రాజేష్ కుమార్ కుష్వాహ మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న సిమెంట్ స్లీపర్‌లన్నింటినీ తొలగించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. లక్నో స్థాయి నుంచి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని డివిజనల్ రైల్వే మేనేజర్ ఎస్‌ఎం శర్మ తెలిపారు.

మూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు.. ఇది సరికాదు..

ఉద్యోగ నియామకాల మీద బీఆర్‌ఎస్ ఇప్పడు మాట్లాడుతోంది.. ఆనాడు ఏం చేశారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. మండలి చైర్మన్ లో కుర్చీలో కూర్చున్నాం అంటే ఏ పదవికి సంబందం ఉండదన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఆర్థిక వనరులు ఉన్నా లేకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోందన్నారు. రుణమాఫీ మాట ప్రకారం పూర్తి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

నాగార్జున వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగతం.. మేమెందుకు స్పందించాలి..!

అక్కినేని నాగార్జున న్యాయస్థానానికి వెళ్తే మేమెందుకు స్పందించాలి.. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ లోను కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు.. ఇక, మంత్రి కొండా సురేఖ.. అక్కినేని నాగార్జున ఫ్యామిలీ వ్యవహారంపై మీడియా ప్రశ్నించగా.. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.. నాగార్జున న్యాయస్థానానికి వెళ్తే మేమెందుకు స్పందించాలి.. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం అని కొట్టిపారేశారు..

ఆదివాసీ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. సమస్యలు చెప్పుకున్న ప్రతినిధులు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసి సంఘాలు భేటీ అయ్యాయి. జూబ్లీహిల్స్ లోని సీఎం అధికారిక నివాసంలో బుధవారం భేటీ అయిన పలు సంఘాల ప్రతినిధులు..తమ ప్రాంత సమస్యలను సీఎం కి వివరించారు. జైనూరు ఘటన దరిమిలా ఆదివాసులు, మైనారిటీ వర్గాల మధ్య సఖ్యత కుదుర్చేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇరు వర్గాలతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవ తీసుకొని ఆదివాసి సంఘాలను తొడ్కొని సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమ సమస్యలను ఆదిలాబాద్ ఆదివాసి సంఘాల ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. స్థానికంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ వినతి పత్రాలు అంద చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

పండగ ఎఫెక్ట్.. దసరా ముందు 30 మేకలను ఎత్తుకెళ్లిన దొంగలు..

తెలంగాణలో దసరా పండగ అంటేనే మందు, మాంసంతో ఎంజాయ్ చేస్తారు. అందరి ఇళ్లలో పండగ రోజు మటన్, మద్యం లేకుండా ఉండదు. పండగ కోసం అప్పు చేసి మరీ.. కొనుకుంటారు. ఇదిలా ఉంటే.. మార్కెట్‌లో ఈ సమయంలో మేకలకు, గొర్రెలకు డిమాండ్ ఎక్కువ. ఒక్కో మేక, గొర్రె మామలు సమయం కన్నా.. వెయ్యి రెండు వేలు ఎక్కువనే పలుకుతుంది. ఎంత డిమాండ్ ఉన్నా.. కొనకుండా మాత్రం ఉండరు. అమ్మకందారులైతే.. పండగ సీజన్ అదునుగా చూసి ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. ఏదో విధంగా అయితే.. దసరా పండగ రోజు మాత్రం ఇంట్లో మటన్ కర్రీ ఉండాల్సిందే.. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీరప్ప గడ్డలో కెమిడి లక్ష్మయ్యకు చెందిన 30 మేకలను గుట్టుచప్పుడు కాకుండా కొట్టం నుండి అర్థరాత్రి గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. పండగ సమయంలో జిల్లాలో మేకల దొంగతనం కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు లక్ష్మయ్య పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు వాటి విలువ ఉంటుందని ఆవేదన చేందుతున్నాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగలను వెతికే పనిలో ఉన్నారు.

మద్యం టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. మంత్రి ఆగ్రహం

వైసీపీ తీరుపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటే తప్పా..? అని ప్రశ్నించారు. బార్లు.. మద్యం వ్యాపారాలను గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు లాక్కొన్నారు.. మద్యం టెండర్లు వేయొద్దని తానెవర్నీ బలవంతం చేయలేదు..? అని చెప్పారు. నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు.. మద్యం టెండర్లు వేసుకోవచ్చని అన్నారు. గత ఐదేళ్లల్లో వ్యాపారం చేసుకోవాలి అంటే భయం.. తమ కార్యకర్తలతో తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కష్టబడిన కార్యకర్తలకు సంవత్సరానికి రూ. 10 కోట్లు చొప్పున రూ. 50 కోట్లు ఇస్తానని చెప్పాను.. ఇప్పటికే రూ. 2 కోట్లు ఇచ్చానని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రికి సీఎం.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

విజయవాడ ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని చంద్రబాబు, లోకేష్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం.. అమ్మవారికి పట్టువస్త్రాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్పించారు. ఈ క్రమంలో.. సీఎంకు ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం చంద్రబాబు తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు. మేళతాళాల నడుమ ప్రభుత్వం తరపున దుర్గమ్మకు సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టువస్త్రాలను సమర్పించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈఓ కేఎస్ రామారావు, దేవాదాయ శాఖ అధికారులు దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుకు కొండచరియలు విరిగిపడినవి, వాటిని బాగుచేసినవి ఫోటోలు అధికారులు చూపించారు.

కెమిస్ట్రీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు

రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు లభించాయి. డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ జంపర్‌లకు కెమిస్ట్రీలో నోబెల్ అవార్డులు లభించాయి. ఈ ముగ్గురు రసాయన శాస్త్రంలో 2024 నోబెల్ బహుమతులను గెలుచుకున్నారని అవార్డు ప్రదాన సంఘం బుధవారం తెలిపింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హస్సాబిస్, జంపర్‌ను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ వెల్లడించింది. కంప్యుటేషనల్ ప్రొటీన్‌ డిజైన్‌కుగాను డేవిడ్ బెకర్‌, ప్రొటీన్‌ స్ట్రక్చర్ ప్రిడిక్షన్‌కు డెమిస్‌, జంపర్‌‌లు ఈ పురస్కారాలను అందుకోనున్నారు. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం అక్టోబర్‌ 14వరకు కొనసాగనుంది. సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. మంగళవారం భౌతికశాస్త్రంలో నోబెల్‌ అవార్డులను ప్రకటించారు. బుధవారం రసాయనశాస్త్రంలో నోబెల్‌కు పురస్కారానికి ఎంపికైన వారి జాబితా వెలువడింది. గురువారం సాహిత్యం విభాగానికి సంబంధించి ప్రకటన ఉంటుంది. శుక్రవారం రోజున నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 14న అర్థశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

ఈనెల 14 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 అభ్యర్థులకు కీలకమైన సమాచారాన్ని అందించింది. 2024, అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు 2024, అక్టోబర్ 14 నుండి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, అభ్యర్థులు హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్‌లోడ్ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే, టోల్ ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించవచ్చని చెప్పారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగనున్నాయి.