Site icon NTV Telugu

Police Overaction: బైక్‌ ఆపలేదని..యువకుడిపై ఖాకీ కర్కశత్వం..

Police Overaction

Police Overaction

శాంతి భద్రత‌ల‌ను కాపాడాల్సిన పోలీసులే సామాన్యులపై తన ప్రతాపాన్ని ప్రద‌ర్శిస్తున్నారు. వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు బైక్ ఆపలేదనే కోపంతో ఎస్‌ఐ రెచ్చిపోయాడు. ఎస్‌ఐని అనే రుబాబుతో అతని చెంప చెళ్లుమనిపించడంతో బాధితుడి చెవి డ్యామేజ్ అయింది. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా.

వాహనాలు నడిపే వాళ్లు నిబంధనలు పాటించకపోతే వారిపై కేసులు నమోదు చేయడమే పోలీసుల బాధ్యత. వాహనాల తనిఖీల సమయంలో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాని కేవలం ఓ బైకర్‌ వాహనాల చెకింగ్ సమయంలో వాహనం ఆపలేదన్న కోపంతో నిజామాబాద్ జిల్లాకి చెందిన ఓ ఎస్‌ఐ తన ప్రతాపం చూపించాడు. ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చెందిన పట్టేం శ్రీనివాస్ ప్రస్తుతం చెవి కర్ణభేరి దెబ్బతిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బాధితుడు శ్రీనివాస్ గతనెల 25వ తేదీన పనుల నిమిత్తం పొలానికి వెళ్తుండగా ధర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణ త‌న సిబ్బందితో రామ‌డుగు గ్రామ శివారులో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. అయితే శ్రీనివాస్ పోలీస్ చెకింగ్ చూసుకొకుండా హ‌డావిడిగా పొలం దగ్గరకు వెళ్లి తిరిగి ఐదు నిమిషాల్లో వ‌చ్చాడు. దీంతో ఎస్ఐ కోపంతో శ్రీనివాస్ చెంప చెళ్లు మనిపించారు. ఎస్‌ఐ కొట్టిన దెబ్బకు శ్రీనివాస్ చెవిలో రీ సౌండ్‌ రావడంతో భయపడిపోయాడు. వెంటనే నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ఈఎన్ టీ వైద్యునికి చూపించుకోవడంతో చెవిలోని కర్ణభేరి దెబ్బతిన్నదని ఎలా జరిగిందని ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పాడు శ్రీనివాస్.

ఎస్‌ఐ కొట్టాడని చెప్పడంతో కొన్ని రోజులు మందులు వాడితే తగ్గుతుందని చెప్పారు. ఒకవేళ తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్‌ చెప్పి పంపించారు. డాక్టర్లు చెప్పిన దాంతో బాధితుడు శ్రీనివాస్ షాక్‌ అయ్యాడు. తనను అకారణంగా కొట్టారంటూ ఎస్‌ఐ వంశీకృష్ణపై హెచ్ఆర్‌సీని ఆశ్ర‌యించాడు. తాను పని మీద పొలానికి వెళ్తుంటే పోలీసులు ఆపారని వెంటనే వస్తానని చెప్పి వెళ్లి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి హోంగార్డ్‌తో మాట్లాడుతున్న సమయంలో ఎస్ఐ వంశీకృష్ణ తనను కొట్టారని బైక్ పేపర్లు, లైసెన్స్ ఉన్నాయని చెప్పినా వినిపించుకోకుండా కొట్టారంటూ బాధితుడు వాపోయాడు.

ఎస్‌ఐ కొట్టిన దెబ్బకు తనకు వినికిడి సమస్య వచ్చింది. ఈలోపంతో నేను గల్ఫ్‌ దేశం వెళ్తే ఉపాధి కోల్పోతాననే ఆవేదనను హెచ్‌ఆర్‌సీకి నివేధించాడు. ఈవిషయంలో తనకు న్యాయం చేయాలని బాధితుడు శ్రీనివాస్‌ హెచ్‌ఆర్‌సీని కోరాడు. ఏదైనా పొరపాటు చేస్తే తనపై కేసు పెట్టాలి కాని ఈవిధంగా కొట్టడం ఏమిటని ఇప్పుడు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ తన చెవు బాగుపడకపోతే నా జీవనాధారం మూసుకుపోతుంది. తన భవిష్యత్తు శూన్యం అవుతుందంటున్నాడు. ధర్పల్లి ఎస్ఐపై చర్య తీసుకొని నాకు తగిన న్యాయం చేయాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశానన్నారు. బాధితుడికి జరిగిన అన్యాయంపై స్థానికులు సైతం పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో శ్రీలంక బోణీ.. సూపర్-4 బెర్త్ ఖరారు

Exit mobile version