Banjara Hills Police: స్టోర్స్‌ అద్దాలను ధ్వంసం ఘటన.. ఛేదించిన బంజారాహిల్స్ పోలీసులు

Banjara Hils Police

Banjara Hils Police

Banjara Hills Police: కారులో ప్రయాణిస్తూ రోడ్డుపై కనిపించిన స్టోర్స్‌ అద్దాలను ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఘటనల్లో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రధాన రోడ్లపై ఉన్న స్టోర్స్‌, రెస్టారెంట్స్‌ తదితర వ్యాపార సముదాయాలకు చెందిన అద్దాలు ధ్వంసమవుతున్న విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే అద్దాలు ధ్వంసం చేస్తున్నారంటూ ఆయా షాపుల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 8 స్టోర్స్‌ల అద్దాలు ధ్వంసమైన విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

Read also: Srikrishna: శ్రీకృష్ణుణ్ని పెళ్లాడిన యువతి.. వివాహ ప్రమాణ పత్రం కూడా..

ఇక మొత్తం 18 స్టోర్లకు చెందిన అద్దాలు పగిలినట్లు గుర్తించిన పోలీసులు.. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అయితే.. గత నెల 20 నుంచి ఈ నెల 4 వరకు వివిధ సమయాల్లో అద్దాలు ధ్వంసమైనట్లు దర్యాప్తులో తేలింది. కాగా.. ఆ సమయాల్లో రోడ్డుపై వెళ్లిన వాహనాలను సీసీ కెమెరాల్లో పరిశీలించారు. అన్ని సమయాల్లోనూ ఓ మహేంద్ర జైలో కారు సదరు షాపుల ముందు నుంచి వెళ్లినట్లు బంజారాహిల్స్‌ పోలీసులు గుర్తించి కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మౌలాలిలోని బాగ్‌ హైదరీకి చెందిన కారు డ్రైవర్‌ సయ్యద్‌ మహబూబ్‌ హుస్సేన్‌ రిజ్వీ (47)ని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. కారు డ్రైవర్‌ రిజ్వీ ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు చెందిన ఉద్యోగులను తీసుకువెళ్తుంటాడు.

Read also: Premikudu Re-release: థియేటర్స్ లో డాన్సులే.. ప్రేమికుడు రీరిలీజ్..

అయితే.. ఆ కారులో అప్పుడప్పుడు రిజ్వీతో పాటు అదే సంస్థలో కారు డ్రైవర్‌గా పని చేసే అంబర్‌పేటకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ కూడా ప్రయాణిస్తుంటాడు. ఇక అబ్దుల్‌ అమీర్‌ కారులో ప్రయాణిస్తున్న సమయంలో కారులో నుంచే కాటాపుల్ట్‌లో గులకరాళ్లు పెట్టి గురిచూసి రోడ్డుకు పక్కనే ఉండే స్టోర్స్‌ అద్దాలు ధ్వంసం చేసిన విషయం బయటపడింది. కాగా.. ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం, ఫిర్యాదులు రావడంలో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ దాడులపై ఐపీసీ 308 రెడ్‌విత్‌ 34 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితులను నిన్న (శుక్రవారం) రిమాండ్‌కు తరలించారు. దీంతో.. అద్దాలు పగలగొట్టడం ద్వారా పైశాచిక ఆనందం పొందడమే తన లక్ష్యమని, 18 స్టోర్ల అద్దాలు పగలగొట్టినట్లు నిందితుడు అబ్దుల్‌ అమీర్‌ తెలిపాడు.
Ram Mandir : అయోధ్య రామమందిరంలో నేటి నుంచి వీఐపీ దర్శనాలు షురూ