తెలంగాణ రవాణా శాఖ, ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో అధికారుల బృందం విదేశీ వాహనాలపై కొరడా ఝళిపించింది. కోట్ల రూపాయలతో విదేశాల నుంచి కార్లు తెచ్చుకున్న బడాబాబులకు… రవాణా శాఖ షాక్ ఇచ్చింది. రోడ్డు ట్యాక్స్ కట్టకుండా….తిరుగుతున్న కార్ల యజమానులకు భారీగా జరిమానా విధించింది. రోడ్డు పక్కన రోల్స్ రాయిస్, దాని వెనకే ఫెర్రారి.. వరుసగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అదిరిపోయే రేసు కార్లు. ఇదేదో ఫారిన్ కార్ల ప్రదర్శన అనుకుంటే…మీరు తప్పులో కాలేసినట్లే.
వీటిని ఆర్టీఏ అధికారుల స్పెషల్ డ్రైవ్లో స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్లో రవాణా శాఖ అధికారులు…తనిఖీలు నిర్వహించారు. రోడ్ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న పది విదేశీ వాహనాలపై కేసులు నమోదు చేశారు. వాటి యజమానులకు 5 కోట్ల జరిమానా విధించారు. వాహనాలను ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న పది విదేశీ వాహనాల యజమానులపై అధికారులు కేసులు బుక్ చేశారు. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న కార్లకు భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, రాయబారులకు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. దీనిని అదనుగా తీసుకుని విచ్చలవిడిగా విదేశాల నుండి కార్లు దిగుమతి చేస్తోంది ముంబై మాఫియా. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లను…మణిపూర్లోని ఓ మారుమూల ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రాయబారులు పేరుతో చెల్లించాల్సిన పన్ను ఎగొట్టేందుకు ముఠా ప్లాన్ చేస్తోంది. ఏడాది కాలంలో 20కి పైగా కార్లు దిగుమతి అయ్యాయి. ముంబై ముఠా నుండి వస్తున్న కార్లు ఎక్కువ శాతం హైదరాబాద్ ప్రముఖులే కొన్నట్టు అభియోగం ఉంది.
