DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్‌పై కీలక ప్రకటన

Dgp Cv Anand

Dgp Cv Anand

తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్ నిర్వహించారు. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను అమలు చేయడంలో పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పటికే దేశంలోనే నంబర్‌వన్‌గా గుర్తింపు తెచ్చుకుందని, విప్లవాత్మక మార్పులతో ఒక బ్రాండ్‌గా ఎదిగిందని అన్నారు. తన హయాంలో కూడా ఇదే స్థాయిలో శాఖ పనితీరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వేగంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేస్తామని తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు మంచి రికార్డు ఉందన్నారు. గత నాలుగేళ్లుగా ఆందోళనలు, పండుగలు, బందోబస్తు, పెద్ద ఈవెంట్ల నిర్వహణలో పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారని చెప్పారు. భవిష్యత్తులో కూడా విధి నిర్వహణలో మరింత విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. రోజురోజుకీ నేరాల స్వరూపం మారుతోందని సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు సిస్టమ్‌లను హ్యాక్ చేయడం, ప్రజలను మభ్యపెట్టడం, భయపెట్టి డబ్బులు దోచుకోవడం వంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం జిల్లాల వారీగా ఎస్పీలు కూడా చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు.

మాదకద్రవ్యాల సమస్య ఇప్పుడు పిల్లల వరకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈగల్, హెచ్-న్యూ విభాగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. యాంటీ నార్కోటిక్ డ్రైవ్‌లను జిల్లా స్థాయి నుంచే కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాదకద్రవ్యాల నియంత్రణ తమ టాప్ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ టెక్నిక్‌లను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి క్లియర్ చేయడం, రోడ్డు మార్కింగ్‌లను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య లక్షకు పైగానే ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చైల్డ్ ట్రాఫిక్ భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

కలుషిత ఆహారం అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు పోలీస్ శాఖ స్పందనను మరింత మెరుగుపరచాలని చెప్పారు. వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా పోలీసుల సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మావోయిస్టుల నియంత్రణలో గ్రేహౌండ్స్ బలగాలు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ బలగాలపై పునఃసమీక్ష చేస్తున్నామని వెల్లడించారు.

పోలీస్ శాఖలో ప్రస్తుతం 19 వేల ఖాళీలు ఉన్నాయని తెలిపారు. రిక్రూట్మెంట్, ట్రైనింగ్ వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఏఐ అనేక రంగాల్లో వినియోగంలో ఉందని, ఫస్ట్ రెస్పాండర్‌గా ఉన్న పోలీస్ శాఖ కూడా ఏఐని ఎంతవరకు సమర్థంగా వినియోగించుకోవచ్చో పరిశీలిస్తున్నామని చెప్పారు. అధికారుల మధ్య సమన్వయం ఉంటేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.