1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది ఇవాళ జరిగిన ఎస్ఎల్బీసీ 29వ సమావేశం… బీర్కే భవన్లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థికమంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని.. ఒక వారంలో దాదాపు 61 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలో రూ.7,360 కోట్లు పైగా జమ చేశామని తెలిపారు. రైతు బంధు ద్వారా ప్రభుత్వం అందించిన సహాయంతో ఇతర రుణాలకు మళ్లించకుండా వారి సేవింగ్ అకౌంట్లలో జమ చేయాలని సీఎం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు ఆదేశాలు జారీచేశారని, బ్యాంకులకు ఈ ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంకర్లు పంటరుణాలను సకాలంలో జాప్యం లేకుండా వారికి అందేలా చూడాలని కోరారు మంత్రి హరీష్రావు.
రైతు బంధు మొత్తాన్ని రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తారన్నారు. కోవిడ్ సమయంలో బ్యాంకర్లు తమ సేవలు అందించాయని, బ్యాంకింగ్ సిబ్బందికందరికి వ్యాక్సినేషన్ కు చర్యలు తీసుకున్నామని తెలిపారు హరీష్రావు.. చిన్న చిన్న వ్యాపారస్తులకు మరింత ముద్రా రుణాలను అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని బ్యాంకర్లకు తెలిపారు. కాగా, ఈ నెల 15వ తేదీ నుంచి రైతులకు పంట సాయంగా.. రైతు బంధు పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.. కొన్ని బ్యాంకులు వారి పాత బకాయీల కింద జమ చేసుకోవడంతో.. రైతుల ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ వ్యవహారం సీఎం కేసీఆర్ దృష్టికి రావడంతో.. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన విషయం తెలిసిందే.