CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని పలు కీలకమైన భూ సమస్యలు, అనాథికారిక లేఅవుట్లు, క్రమబద్ధీకరణ (Regularization) , లబ్ధిదారులకు పట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సుదీర్ఘమైన స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సుదీర్ఘ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
సింగరేణి బొగ్గు గనుల ప్రాంత భూములపై కమిటీ
సింగరేణి బొగ్గు గనుల పరిధిలోని ప్రాంతాల్లో నివసిస్తున్న కార్మికులకు భూముల పట్టాల పంపిణీలో సాంకేతిక, చట్టపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కమిటీ స్థానిక ప్రజాప్రతినిధులు, సింగరేణి యాజమాన్యంతో సమన్వయం చేసుకుంటూ నివేదిక నివేదిస్తుందని, తద్వారా కార్మికులకు త్వరితగతిన హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఎల్బీ నగర్లో 9,500 కుటుంబాలకు ‘జీవో 118’ ఊరట
హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసముంటున్న సుమారు 9,500 కుటుంబాల సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జీవో 118 (GO 118) ప్రకారం ఆ ఇళ్లను క్రమబద్ధీకరించి, స్థానిక నివాసితులకు పూర్తి హక్కులు కల్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ప్రక్రియను ముగించి బాధితులకు ఊరట కలిగిస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఐదేళ్ల తర్వాత అమ్మకపు హక్కులు
ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సీఎం కీలక నిబంధనను వివరించారు. ఈ ఇళ్లకు సంబంధించి ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ అమల్లో ఉంటుందని, ఆ గడువు పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు పూర్తి అమ్ముకునే హక్కులు (Freehold rights) కల్పిస్తామని వెల్లడించారు. నిబంధనల ప్రకారం వర్తించే నాలా రుసుము , రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు బదిలీ చేస్తామని స్పష్టం చేశారు.
అసైన్డ్, నాలా, భూదాన్ భూములపై ప్రత్యేక మార్గదర్శకాలు
రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఇతర భూ సమస్యల పరిష్కారానికి సైతం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అసైన్డ్ భూములు, నాలా (Nala) కన్వర్షన్ జరగని ప్రైవేట్ పట్టా భూములు , అనధికారిక లేఅవుట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి త్వరలోనే నూతన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో పాటు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూదాన్ భూములు, మాజీ సైనికులకు కేటాయించిన భూముల సమస్యలను కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని సభకు హామీ ఇచ్చారు.

