Telangana : జూనియర్ కళాశాలల్లో హాజరు కోసం ఇక ఫోటో చాలు.. ఎలా అంటే?

  • జూనియర్ కళాశాలల్లో కొత్త హాజరు పద్ధతి
  • 10 సెకన్లలో రిజిస్ట్రేషన్.. WhatsAppలో తల్లిదండ్రులకు సమాచారం
  • ప్రాక్సీ హాజరుకి చెక్.. పారదర్శకత పెంపు
  • విద్యా రంగంలో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ దిశగా తెలంగాణ
Telangana Inter

Telangana Inter

Telangana : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యా రంగంలో మరో ముఖ్యమైన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)‌ను శనివారం నుంచి విజయవంతంగా అమలు చేసింది. విద్యా రంగంలో డిజిటల్ మార్పుకు ఇది ఒక కీలక అడుగుగా అధికారులు పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా విద్యార్థుల హాజరు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదు అవుతుంది. ప్రాక్సీ హాజరు లేదా రికార్డుల్లో తారుమారు చేసే అవకాశం లేకుండా ఖచ్చితమైన హాజరు నమోదు జరుగుతుందని అధికారులు తెలిపారు. హాజరు వివరాలు వెంటనే కేంద్ర డేటాబేస్‌లో అప్‌డేట్ అవుతాయి. దీంతో విద్యాశాఖకు రియల్-టైమ్‌లో పర్యవేక్షణ సులభమవుతుందని, ప్రిన్సిపాళ్లకు మానవీయ పనిలో తగ్గింపుతో పాలనా సౌలభ్యం కలుగుతుందని వారు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను విశ్లేషించడంలో కూడా ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని అన్నారు.

SBI Robbery : క్యాషియరే కన్నం వేశాడు.. చెన్నూరు ఎస్బీఐ-2 బ్రాంచ్ చోరీలో అసలు డ్రామా

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా, IAS మాట్లాడుతూ, “430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రవేశపెట్టడం ఒక విప్లవాత్మక అడుగు. ఇది పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనను తీసుకువస్తుంది. అలాగే డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో ఉపకరిస్తుంది. విద్యను మరింత సమర్థవంతం చేయడం, డిజిటల్ చేయడం, విద్యార్థులకు స్నేహపూర్వకంగా మార్చడం మా లక్ష్యం” అని పేర్కొన్నారు. అదే విధంగా టీజీబీఐఈ కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ, “ఈ సిస్టమ్‌ను విజయవంతం చేయడానికి ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి సహకరించాలి.

ప్రస్తుతం మొత్తం 1,64,621 విద్యార్థుల్లో 63,587 మంది రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. మిగతా రిజిస్ట్రేషన్లు సోమవారానికల్లా పూర్తవుతాయి” అని తెలిపారు. ప్రతి విద్యార్థి రిజిస్ట్రేషన్‌కు కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే పడుతుందని, WhatsApp ఇంటిగ్రేషన్ ద్వారా తల్లిదండ్రులకు విద్యార్థుల హాజరు, రిపోర్టులపై రియల్-టైమ్ సమాచారం చేరుతుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఆధునిక డిజిటల్ వ్యవస్థ ప్రారంభం కావడం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో, విద్యార్థుల అకడమిక్ ట్రాకింగ్‌లో, పారదర్శకత సాధించడంలో మైలురాయిగా భావిస్తున్నారు.

SBI Robbery : క్యాషియరే కన్నం వేశాడు.. చెన్నూరు ఎస్బీఐ-2 బ్రాంచ్ చోరీలో అసలు డ్రామా