Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనా పరమైన కారణాలతో పలువురు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు (G.O.Rt.No.932) అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు అందరూ తక్షణమే తమ పాత విధులను వదిలి, కొత్తగా కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
అరణ్య భవన్కు వి.ఎస్.ఎన్.వి. ప్రసాద్
ప్రస్తుతం పోస్టింగ్ కోసం నిరిక్షిస్తున్న వి.ఎస్.ఎన్.వి. ప్రసాద్, IFSకు ప్రభుత్వం అరణ్య భవన్లో కీలక బాధ్యతలు అప్పగించింది . హైదరాబాద్లోని ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (HoFF) కార్యాలయంలో ఆయనను కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ప్లానింగ్ అండ్ విజిలెన్స్) గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
జిల్లాల అటవీ అధికారుల (DFO) మార్పులు
రాష్ట్రంలోని పలు జిల్లాలకు కొత్త అటవీ అధికారులను కేటాయిస్తూ ప్రభుత్వం బదిలీల జాబితాను విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారిగా ఉన్న జి. కిష్ట గౌడ్, IFS జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ అధికారిగా బదిలీ కాగా, ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, IFS ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారిగా నియమించారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, IFS ను రంగారెడ్డి జిల్లా అటవీ అధికారిగా బదిలీ చేయగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ అధికారిగా ఉన్న ఎం. నవీన్ రెడ్డి, IFSను మహబూబ్నగర్ జిల్లా అటవీ అధికారిగా నియమించారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, IFS ను నిజామాబాద్ జిల్లా అటవీ అధికారిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్ డీఎఫ్ఓగా చిన్న విశ్వనాథ్కు అదనపు బాధ్యతలు
జిల్లాల అధికారుల మార్పులతో పాటు ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్గా సేవలందిస్తున్న చిన్న విశ్వనాథ్ భూసారెడ్డి, IFSకి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆమె తన ప్రస్తుత విధులను కొనసాగిస్తూనే, ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి (DFO) గా పూర్తి అదనపు బాధ్యతలను (FAC) నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

