Site icon NTV Telugu

తెలంగాణలో కరోనా ఆంక్షలపై.. హైకోర్టు ఏం ఆదేశించనుంది?

తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సోమవారం నాడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఈనెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈనెల 12 వరకు మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 6.95 పాజిటివిటీ రేటు నమోదైంది. అలాగే జీహెచ్‌ఎంసీలో 5.65 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్లు అధికారులు తమ రిపోర్టులో కోర్టుకు నివేదించారు.

Read Also: క‌రోనా ఎఫెక్ట్‌: నైట్ క‌ర్ఫ్యూపై నేడు కీల‌క నిర్ణయం

గత విచారణలో పబ్లిక్ గేదరింగ్‌పై నిషేధం విధించాలని హైకోర్టు ఆదేశించడంతో పబ్లిక్ ర్యాలీలు, సమావేశాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా టెస్టుల సంఖ్య పెంచాలని కూడా గత విచారణలో కోర్టు సూచించింది. అటు చిన్నారుల కోసం నీలోఫర్‌తో పాటు ఇతర ఆస్పత్రుల్లో వసతులు పెంచాలని ఆదేశించింది. థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లలో నిబంధనలు కఠినతరం చేయాలని కూడా హైకోర్టు సూచించింది. కాగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే నైట్ కర్ఫ్యూ విధిస్తారు. అయితే ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా ఉండటంతో నైట్ కర్ఫ్యూపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Exit mobile version