Telangana Government: జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది. ప్రభుత్వం ముందు లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం కోసం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగంలో వారి సేవలను వినియోగించుకుంటూ ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అటవీ ప్రాంతాలపై వారికి ఉన్న పట్టును, అవగాహనను గుర్తించి, వారిని పర్యాటక మార్గదర్శకులుగా (టూరిస్ట్ గైడ్స్) నియమించాలని నిర్ణయించింది.
ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాలు, కర్రిగుట్టలు వంటి పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయడంలో లొంగిపోయిన మావోయిస్టుల సేవలను ప్రభుత్వం వినియోగించుకోనుంది. లొంగిపోయిన మావోయిస్టులకు ‘గిరిదర్శక్’ అనే పేరుతో ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అటవీ సంపద, స్థానిక పర్యాటక విశేషాలను పర్యాటకులకు వివరించే బాధ్యతను వీరు తీసుకోనున్నారు. ఈ విధుల్లో చేరడానికి ముందు వీరికి ఒక నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణను కూడా ప్రభుత్వం అందించింది. ముఖ్యంగా ములుగు అటవీ ప్రాంతంలోని పర్యాటక క్షేత్రాల్లో వీరిని గైడ్స్ గా నియమించి, పర్యాటకులకు మెరుగైన సేవలందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నిర్ణయం ద్వారా అటవీ ప్రాంతాల్లోని పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా, లొంగిపోయిన వారికి గౌరవప్రదమైన ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
