తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. మేడారం జాతరకు భారీ ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు రాష్ట్రం మొత్తానికి కాకుండా కేవలం వరంగల్, పెద్దపల్లి జిల్లాలకే వర్తించనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సెలవు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వరంగల్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సెలవులపై ప్రకటన చేశారు.
మేడారం జాతర సందర్భంగా వరంగల్, పెద్దపల్లి జిల్లాలలో శుక్రవారం సెలవు ఉంటుందని.. విద్యాసంస్థలతో పాటు స్థానిక సంస్థలకు సెలవు వర్తిస్తుందని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటన చేశారు. అయితే బ్యాంకులు మాత్రం తెరిచే ఉంటాయని వివరించారు. కాగా శుక్రవారం నాడు మేడారం జాతరకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. మేడారంలో కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మలను కేసీఆర్ దర్శించుకోనున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
