El Nino : ఎల్‌నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!

  • వర్షాభావంపై ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ
  • వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్
  • దేవాదుల తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం
  • రైతులు ఆందోళన చెందొద్దన్న మంత్రులు
Ponguleti

Ponguleti

El Nino : రాష్ట్రంలో ఎల్‌నీనో ప్రభావంతో సాధారణం కంటే వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలసి ఎల్‌నీనో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, కంటింజెన్సీ ప్రణాళికల అమలుపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ శాసనసభ డిప్యూటి స్పీకర్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, దొంతి మాధవ రెడ్డి, కడియం శ్రీహరి, కె.ఆర్. నాగరాజు, డా. మురళి నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎల్‌నీనో పరిస్థితుల నేపథ్యంలో వర్షాభావ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, కంటింజెన్సీ ప్రణాళికలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వర్షాభావ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించగా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి దేవసేనను నియమించినట్లు తెలిపారు. వ్యవసాయం, తాగునీటి లభ్యత, భూగర్భ జలాలు, వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక అధికారులు నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారని చెప్పారు. సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి అవసరమైన సహాయం కోరనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేయగల పంటలపై వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. కోతుల బెడద నివారణ చర్యలపైనా రైతులకు సూచనలు ఇవ్వాలని అన్నారు.

దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ప్రతిరోజూ పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, ఏదైనా లోపం తలెత్తితే 24 గంటల్లో మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాదుల ద్వారా తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దేవాదుల, సాగునీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఈ సమన్వయాన్ని ములుగు జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలి

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను సన్నద్ధం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎల్‌నీనో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో రైతులకు తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా లెమన్ గ్రాస్ వంటి ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు.

వర్షాభావ పరిస్థితుల్లో పశుసంవర్థక రంగానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి అవసరాలకు సరిపడా నీటి లభ్యతపై వెంటనే సమగ్ర నివేదికలు సిద్ధం చేసి అందించాలని సూచించారు.

వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పైస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని, ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టడం ద్వారానే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడగలమని మంత్రి అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సామాజిక బాధ్యతతో పనిచేస్తే వర్షాభావ పరిస్థితులను విజయవంతంగా అధిగమించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.