Site icon NTV Telugu

మళ్లీ కేసీఆర్‌ ప్రెస్‌మీట్.. కఠిన ఆంక్షలు తప్పవా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి మీడియా ముందుకు రానున్నారు.. కరోనా సమయంలో కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెడుతున్నారంటే.. ఆయన ఏం చెబుతారు..? ఎలాంటి ఆంక్షలు పెడతారు..? కేసుల పరిస్థితి ఏంటి? అనేదానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూసేవారు.. ఇప్పుడు మళ్లీ కోవిడ్‌ విజృంభిస్తోంది.. ఓవైపు ఒమిక్రాన్‌.. మరోవైపు డెల్టా కేసులు వరుసగా పెరుగుతూ పోతున్నాయి.. ఈ నేపథ్యంలో.. కోవిడ్‌ తాజా పరిస్థితి, మహమ్మారి విజృంభిస్తే.. ఎదుర్కోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్‌.. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది.. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితిపై సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్య-ఆరోగ్య శాఖ సన్నద్ధతను మంత్రి హరీష్‌రావు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని.. ఇప్పటికే 5 కోట్లకు పైగా కోవిడ్‌ టీకా డోసులు ఇచ్చినట్లు కేబినెట్‌కు వివరించారు హరీష్‌రావు.. అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చని స్పష్టం చేశారు హరీష్‌రావు.

Read Also: అబుదాబి ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్‌ దాడి..

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పలు కీలక సూచనలు చేశారు.. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సహకారం తీసుకోవాలని ఆదేశించిన ఆయన. శాఖల సమన్వయంతో వాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు.. దీనిపై మంత్రులు, కలెక్టర్లు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అయితే, కేబినెట్‌ సమావేశం తర్వాత మీడియా సమావేశం నిర్వహించనున్నారు కేసీఆర్… కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను వివరించనున్నారు.. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ఈ నె ల30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే కాగా.. కరోనా కట్టడికి మరిన్ని కఠిన ఆంక్షలు తీసుకుంటారా? కర్ఫ్యూకు వెళ్లే అవకాశం ఉందా? నైట్‌ కర్ఫ్యూతో సరిపెట్టబోతున్నారా? నైట్‌ కర్ఫ్యూకు వెళ్తే.. సినిమా థియేటర్ల పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.. దీంతో.. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version