Site icon NTV Telugu

జూడాల స‌మ్మెపై సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం.. వెంట‌నే విధుల్లో చేరాలి..

KCR

త‌మ డిమాండ్ల సాధ‌న కోసం స‌మ్మెకు దిగిన జూనియ‌ర్ డాక్ట‌ర్లు రేప‌టి నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను కూడా బ‌హిష్క‌రించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. ఈ నేప‌థ్యంలో జూడాల స‌మ్మెపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైద్యాధికారులతో ప్రగతిభవన్ లో స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం.. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదని.. వారి సమస్యలను పరిష్కరిస్తూనే వున్నదని ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

కరోనా పరిస్థితి, వాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాల మీద ఇవాళ స‌మీక్ష నిర్వ‌హించారు సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల విషయాన్ని వైద్యాధికారులు.. ఆయ‌న దృష్టికి తీసుకొచ్చారు.. వారి సమస్యలపై సీఎం మాట్లాడుతూ…. జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలు అయిన‌ప్పుడు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదు. వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చు. అంతేకానీ, చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, సమయాసందర్బాలను కూడా చూడకుండా, సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరియైన పద్దతి కాద‌న్నారు.. కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించ‌ర‌న్నారు సీఎం.. ఇక‌, చాలా రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు స్టయిఫండ్ ను తెలంగాణ కంటే తక్కువగా ఇస్తున్న విషయాన్ని వైద్యాధికారులు సిఎం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సమస్యలు ఏమిటి అని సిఎం ఆరాతీసారు. అధికారులు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

మ‌రోవైపు.. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సిఎం నిర్ణయించారు. మూడు సంవత్సరాల వైద్య విద్య అభ్యసించి కోవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్య విద్యార్దులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్ని అందించాల‌న్నారు.. కరోనా సేవలందిస్తున్న నేపథ్యంలో జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్ లో ఇప్పటికే అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలమేరకు ఎక్స్ గ్రేషియాను కూడా అందిస్తున్న నేపథ్యంలో ప్రస్థుతం వారి కోరికమేరకు సత్వరమే అందించాలని …అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

Exit mobile version