Telangana Cabinet Decisions : రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు, సన్నాలకు బోనస్, ఈవీ ఆటోలకు భారీ సబ్సిడీ.!

  • కొత్త రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు
  • సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్
  • ఈవీ ఆటోలకు రూ.1.5 లక్షల వరకు సబ్సిడీ
  • స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు
Cabinet

Cabinet

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ప్రజారోగ్యంతో పాటు సంక్షేమం, వ్యవసాయం, విద్య , పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రక్రియ ద్వారా కొత్తగా 62 లక్షల మందికి లబ్ధి చేకూరడంతో, రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 42 లక్షలకు చేరింది. వీరందరికీ స్మార్ట్ కార్డులు అందించేందుకు అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

వ్యవసాయ రంగానికి ఊతం.. సన్న ధాన్యానికి బోనస్, మిగులు ధాన్యం ఈ-వేలం

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో వానాకాలం పంటకు సంబంధించి ఏడు రకాల సన్న ధాన్యం సాగుపై గ్రామ పంచాయతీలు, రైతు వేదికల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడు రకాల సన్నాలకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు, యాసంగి ధాన్య సేకరణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా, లబ్ధిదారులకు కనీస మద్దతు ధర చెల్లించి సేకరించిన 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో కేంద్రం కొనుగోలు చేయగా మిగిలిన 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2,389 బేసిక్ ప్రైస్‌తో ఈ-వేలం (e-Auction) ద్వారా విక్రయించేందుకు ఆమోదం తెలిపింది.

‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్ , ఈవీ ఆటోలకు రూ.1.5 లక్షల సబ్సిడీ

రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’ను డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించాలని, ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో జరగనున్న ఈ సమ్మిట్‌లో హైదరాబాద్ ‘ఫ్యూర్.. సిటీ’ ప్లాన్‌ను ఆవిష్కరించాలని కేబినెట్ నిశ్చయించింది. అలాగే హైదరాబాద్ నగరంలో కాలుష్య నివారణకు గాను ప్రస్తుతం ఉన్న 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా (EV) మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద పాత ఆటోను స్క్రాప్ చేసి క్రొత్త ఈ-ఆటో కొనుగోలు చేసినా లేదా పాత ఆటోకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చుకున్నా గరిష్ఠంగా రూ.1,50,000 సబ్సిడీ అందిస్తారు. కాలుష్య కారక పరిశ్రమలను శివార్లకు తరలించే HILT పాలసీ దరఖాస్తు గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించారు.

విద్యా సంస్కరణలు , సాగునీటి ప్రాజెక్టులకు నిధులు

విద్య , నైపుణ్యాభివృద్ధి రంగానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు , పాలిటెక్నిక్ కళాశాలలను తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ పరిధి నుంచి తొలగించి, నూతనంగా ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ (YISU) పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్తగా ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్ , దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రాజెక్టుల విషయానికొస్తే, మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-2 పనులకు రూ.2,100 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం తెలుపగా, గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీలకు పెంచడంపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ నియామకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.