భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందడి షురూ అయ్యింది. ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బోనాల జాతర నిర్వాహణ,ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోనాల జాతర ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాల ఏర్పాట్లపై కూడా మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. ఇక పాతబస్తీలో ఈసారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇప్పటికే సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈఏడాది బోనాల జాతర ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కమిటి చైర్మన్ రాకేశ్ తివారి తెలిపారు. ఉత్సవాలు ఈనెల 30వ తేదీన గోల్కొండ అమ్మవారి బోనాలతో ప్రారంభమవుతున్నాయి.
బోనాల సమర్పణ మరుసటి రోజు పాతబస్తీలోని దేవాలయాల నుంచి అమ్మవారి ఘటాలతో సామూహిక ఊరేగింపు నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ ఊరేగింపు ఉప్పుగూడ, బేలా, గౌలిపురా, శాలిబండ, కోట్ల అలీజా, మీరాలంమండి, కసరట్ట తదితర ప్రాంతాల నుంచి చార్మినార్ ద్వారా నయా పూల్లోని మూసీ వరకు కొనసాగుతుంది.
బోనాల ఉరేగింపు కేరళ పులికళి, భేరీ నృత్యం, గరిగెలు, బేతాళ నృత్యం, ఒగ్గోళ్ల నృత్యం, బోనాలు, కాళికాదేవి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, పొట్టి పోతరాజులు, సింహరథం, డప్పులోళ్లు, హనుమంతునిలో రాముడు, తయ్యం, దేవ నృత్యం, ఉరుములు, కొమ్ముకొయ్య, జడల కోలాటం తదితర కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.
