తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులుచెరుగుతున్నారు.. ఇవాళ ఇల్లంతకుంట బహిరంగ సభలో.. మరోసారి తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై హాట్ కామెంట్లు చేశారు.. బీజేపీ అధికారంలోకి వస్తే కేటీఆర్ను బొక్కలో వేయిస్తాం అంటూ హెచ్చరించిన బండి సంజయ్.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆరే కారణం అని ఆరోపించారు. ఇక, ధాన్యం కొనుగోలులో కేసీఆర్ బ్రోకర్ మాత్రమే.. కేంద్రమే పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని కామెంట్ చేసిన ఆయన.. పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయించే బాధ్యత నేను తీసుకుంటా.. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. దళిత బంధు స్కీం కొత్తది కాదు.. ప్రధాని మోడీ ఏనాడో ‘స్టాండప్ ఇండియా’ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. మరోవైపు.. అంబేద్కర్ గురించి మాట్లాడని సీఎం కేసీఆర్.. అంబేద్కర్ పుట్టి పెరిగిన ప్రాంతాలను పంచ తీర్థాలుగా ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం.. స్టాండ్ ఆఫ్ ఇండియా ద్వారా దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందన్నారు.
దళితున్ని రాష్ట్రపతిని చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని.. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ప్రభుత్వం కూడా తమదేనన్నారు బండి సంజయ్.. తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు తాలిబన్ల లాగా.. రాజాకార్ల లాగా యుద్ధానికి వస్తే నేను శివాజిలాగా కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్తానని వ్యాఖ్యానించారు బండి సంజయ్.. తెరాసా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా.. విద్యా వాలంటీర్లను తొలగించిందని మండిపడ్డ ఆయన.. తల్లిదండ్రుల మెడలో నుంచి పుస్తెలు అమ్ముకొని తమ పిల్లల్ని చదివిస్తే ఒక వ్యక్తికి కూడా ఉద్యోగం ఇవ్వని ప్రభుత్వం ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే చూస్తూ ఊరుకున్న ప్రభుత్వం కేసీఆర్దే అని విమర్శించిన బండి.. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆరోపించారు.. తెలంగాణ కోసం 1400 మంది ఆత్మబలిదానాలు చేస్తే , కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని.. హైదరాబాద్ లో వరదలు వస్తే కనీసం సీఎం చూడడానికి కూడా రాలేదన్నారు.. ఇక, హిందూ ధర్మం కోసం ఏడు సార్లు జైలుకు వెళ్లి వచ్చాను.. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర నా యాత్ర మొదలు పెట్టా.. నాకు భయం లేదన్న బండి సంజయ్.. ఎంఐఎం పార్టీకి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు.. ఎంఐఎం పార్టీ వారు మోడీని ఓల్డ్ సిటీలో అడుగుపెట్టనివ్వం అంటున్నారు.. మోడీ దాకా ఎందుకు మీ బతుకులకు బీజేపీ కార్యకర్త చాలు అని నేను అంటున్నానని.. రాబోయేది పేదల ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.