NTV Telugu Site icon

సంగారెడ్డి, నిజాంపేట్ మున్సిపాలిటీలలో టాస్క్ ఫోర్స్ కూల్చివేతలు

ఇప్పటి వరకు 107 అక్రమ నిర్మాణాలపై చర్యలు, వాటిలో 84 నిర్మాణాల కూల్చివేత, 23 అక్రమ నిర్మాణాలు సీజ్ చేశారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై దాడులు కొనసాగుతున్నాయి.శుక్రవారం నాడు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, హెచ్ఎండిఎ యంత్రాంగం సంయుక్తంగా సంగారెడ్డి మున్సిపాలిటీ, నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేత కార్యక్రమాలను నిర్వహించాయి.

సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు(4) అక్రమ నిర్మాణాలను, నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో రెండు(2) అక్రమ నిర్మాణాలను శుక్రవారం అధికారులు కూల్చివేశారు.సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 500 చదరపు గజాల కు మించిన స్థలాల్లో జి ప్లస్ టు (G+2) నిర్మాణాలకు అనుమతులు తీసుకుని వాటిపై అక్రమంగా మరో రెండు, మూడు అంతస్తులు నిర్మించడంమే కాకుండ వాటి మధ్య “పెంట్ హౌస్” నిర్మాణాలు ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించి వాటిని శుక్రవారం కూల్చివేశారు.

నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి నగర్ లో 300 చదరపు గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు (షాపింగ్ షట్టర్లు)జరపడం, వాటిలో ఒక షట్టర్ లో లిక్కర్ షాపు పనిచేస్తుండాన్ని గుర్తించి అధికారులు చర్యలు తీసుకున్నారు. నిజాంపేట్ లో 630 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్ ప్లస్ టు(G+2) నిర్మాణానికి అనుమతి పొంది వాటిపైన అదనంగా మూడు(3) అంతస్తులు, దానిపైన “పెంట్ హౌస్” ను గుర్తించి టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం వాటిని కూల్చివేశారు.

ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, హెచ్ఎండిఎ సంయుక్తంగా 107 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంది. వాటిలో 84 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు మరో 23 అక్రమ నిర్మాణాలను అధికారులు సీజ్ చేశారు.