ఈటల రాజేందర్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కురుక్షేత్ర యుద్ధం అని ఈటెల మాట్లాడుతున్నారని.. ఏడు సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం అంటే పేద వాడు మంచిగ బ్రతకడమేనని.. మాట్లాడితే బీసీ అంటున్న ఈటెల… నీ వ్యాపార భాగస్వాముల్లో ఎంత మంది బిసిలు ఉన్నారు?అని మండిపడ్డారు. బిసి అని చెప్పుకునే హక్కు ఈటెలకు లేదని…ఈటెల రాజేందర్ పదవికి రాజీనామా చేయలేదు… బర్త్ రఫ్ చేశారని పేర్కొన్నారు.
read also : ఈ నెల 25 నుంచి తెలంగాణలో బోనాల పండుగ
మంత్రులకు స్వేచ్ఛ లేదంటున్న ఈటెల… ఆ విషయం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తరువాత గుర్తుకు వచ్చిందా? అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా ఉందని… హుజురాబాద్ లో సంక్షేమ పథకాలు అపుతామని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తోందని.. ఐదేళ్లు కొట్లాడితే రాష్ట్రానికి హైకోర్టు వచ్చిందన్నారు. ఈటెల రాజేందర్ మాటల్లో కొత్తేమి లేదని… పార్టీ మారిన వాళ్ళు మాట్లాడిన మాటలే ఈటెల మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.