పోలవరం నిర్వాసితులపై జగన్‌ది సవతి తల్లి ప్రేమ..!

Somu Veerraju

Somu Veerraju

పోలవరం నిర్వాసిత గిరిజనులపై సీఎం వైఎస్‌ జగన్‌ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఇవాళ బీజేపీ నేతల బృందంతో కలిసి దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితుల కాలనీలు పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు 78 శాతం పూర్తయితే నిర్వాసితుల కాలనీలు 21శాతం మాత్రమే నిర్మాణం జరిగాయన్నారు.. దేవీపట్నం నిర్వాసితుల కాలనీల్లో కరెంటు కూడా లేక భయానక వాతావరణం నెలకొనిఉందన్న ఆయన.. నిర్వాసితుల ఇళ్లకు శ్లాబ్‌ని ఆరు అంగుళాలకు బదలు నాలుగు అంగుళాలే వేశారని ఫైర్ అయ్యారు.. ప్రాజెక్టు ఒక్కటేనా గట్టిగా కట్టడం.. నిర్వాసితుల ఇళ్లు పటిష్టంగా నిర్మించరా…? అని ప్రశ్నించిన సోము వీర్రాజు.. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు రూ.3 వేల కోట్లు విడుదల చేయాలని.. ఆ నిధులను కేంద్రం రీఎంబర్స్‌ చేస్తుందని తెలిపారు.. ఇక, పోలవరం నిర్వాసితులపై ప్రభుత్వం తాత్సారం చేస్తే గిరిజనులతో కలసి బీజేపీ ప్రజాందోళనకు దిగుతుందని ప్రకటించారు సోము వీర్రాజు.