Singireddy Niranjan Reddy: బండి సంజ‌య్ భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయాలి

Niranjan Reddy

Niranjan Reddy

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతుల‌ను రెచ్చ‌గొట్టి పక్కకు తప్పుకున్నాడ‌ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత తనదని, రైతులు వరి వేయాలని కోరిన బండి సంజయ్‌.. ఆ తరువాత మొహం చాటేశారన్నారు.

ఆయన ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన 14 పంటల్లో పొద్దు తిరుగుడు మినహా మరే పంట సాగు చేసినా రైతులకు గిట్టుబాటు కాదని విమర్శించారు. బండి సంజయ్‌కు చేతనైతే గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల ప్రకారం సీ+50 ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని.. లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌ కార్పొరే టర్లతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు హైదరాబాద్‌ అభివృద్ధి కోసం పావలా అయినా తీసుకొచ్చారా? అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నిలదీశారు.

Ranga Reddy: నిన్నేమో కిలో రూ.250.. ఇవాళ చేపలన్నీ నేలపాలు