Siddipet: సీరియల్‌ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!

Siddipet Murders

Siddipet Murders

Siddipet Serial Murder Case: సిద్ధిపేట జిల్లా భూంపల్లి సీరియల్‌ మర్డర్‌ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రజిత గతంలోనూ తన భర్త దుబ్బయ్యను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆమె భర్త, మృతుల కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి.

రజిత గతంలో రెండుసార్లు తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆమె భర్త దుబ్బయ్య ఆరోపించారు. ఒకసారి రోకలి బండతో తన తలపై మోది చంపేందుకు ప్రయత్నించిందని తెలిపారు. తాను ఉల్టా పడుకోవడంతో తలకు బదులుగా కాళ్లపై రోకలి బండతో కొట్టిందని చెప్పారు. మరోసారి వేడి నీళ్లు తనపై పోసి తీవ్రంగా హింసించిందని ఆరోపించారు. అనారోగ్యంతో ప్రస్తుతం మంచానికే పరిమితమైన దుబ్బయ్య.. తాను గతంలో కూలి పని చేసుకునేవాడినని, రజిత చర్యల కారణంగా తన పరిస్థితి దారుణంగా మారిందని వాపోయారు. తనను చంపేందుకు ప్రయత్నించిన రజితను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

రజిత తన మైనర్‌ కుమారుడిని కూడా డబ్బు, బంగారం ఆశ చూపి హత్యలకు ప్రేరేపించినట్లు సమాచారం. తన కుమారుడు చదువులో బాగా రాణించేవాడని దుబ్బయ్య తెలిపారు. పదో తరగతిలో 504 మార్కులు సాధించిన తన కుమారుడిని డబ్బు, బంగారం ఆశ చూపి చదువుకు దూరం చేసిందని ఆరోపించారు. కాలేజీలో చేర్పించినప్పటికీ అతడు సరిగా కాలేజీకి వెళ్లేవాడు కాదని తెలిపారు. హత్యలు చేసేందుకు శారీరకంగా బలంగా ఉండాలని చెప్పి జిమ్‌ సామగ్రిని కూడా ఇప్పించిందని ఆరోపించారు. ఇంట్లోనే జిమ్‌ చేసేవాడని చెప్పారు.

భూంపల్లి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో రజిత, ఆమె భర్త దుబ్బయ్య, మైనర్‌ కుమారుడు నివసిస్తున్నట్లు సమాచారం. రజిత అక్కడ కిరాణా షాప్‌తో పాటు టీ స్టాల్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీ స్టాల్‌కు వచ్చే వ్యక్తుల్లో ఆస్తి తగాదాలు, ఇతర వివాదాలు ఉన్నవారిని.. ముఖ్యంగా ఒంటరి మహిళలను తల్లి, కొడుకు గుర్తించేవారని పోలీసులు తెలిపారు. వారిని టార్గెట్‌ చేసుకుని పరిచయం పెంచుకుని అనంతరం హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునేవారని దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నారు.

రజిత తొలుత ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే రేఖ అనే మహిళను టార్గెట్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మే నెలలో రేఖను హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకున్న అనంతరం మృతదేహాన్ని స్థానిక అడవుల్లోకి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. రేఖను హత్య చేసిన తర్వాత.. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఉన్న వ్యక్తులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తారని రజిత అనుమానం రాకుండా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నెల 7న అదే గ్రామానికి చెందిన అతికం విజయను కూడా రజిత హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయకు తన దాయాదులతో భూ తగాదాలు ఉండటంతో ఆమె హత్యకు గురైతే కుటుంబ వివాదాల కారణంగానే జరిగిందని పోలీసులు భావిస్తారని రజిత భావించిందని సమాచారం. విజయ మృతదేహాన్ని అచ్చాయిపల్లి అడవుల్లోకి తీసుకెళ్లి తగలబెట్టాలని తల్లి, కొడుకు భావించగా.. భారీగా వర్షం కురుస్తుండటంతో మార్గమధ్యంలోని రామక్కపేట వద్ద రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టారు.

రజిత చేతిలో తొలుత హత్యకు గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రేఖ భర్త తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలను ఇంట్లో పడుకోబెట్టి పాల ప్యాకెట్‌ కోసం రజిత షాప్‌కు వెళ్లిన తన భార్య తిరిగి ఇంటికి రాలేదని తెలిపారు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని, నిన్నటి వరకు కూడా ఆమె కోసం వెతుకుతూనే ఉన్నామని చెప్పారు. అయితే పోలీసులు వచ్చి తన భార్య చనిపోయిందని చెప్పడంతో షాక్‌కు గురయ్యామని తెలిపారు. రజితే హత్య చేసినట్లు పోలీసులు చెప్పారని, తన భార్య ఒంటిపై ఉన్న నగల కోసమే ఈ హత్య జరిగిందని తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య హత్యకు గురైన విషయం తెలిసినప్పటికీ రజిత ఏమీ తెలియనట్లు నటించిందని రేఖ భర్త ఆరోపించారు. “రేఖ దొరికిందా?” అంటూ తమను అడిగిందని తెలిపారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.