తెలంగాణ రైతులు బాజాప్తాగా వరి వేయండని వైఎస్ షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఎడ్లూర్ ఎల్లారెడ్డిలో పర్యటించారు వైఎస్ షర్మిల. వడ్లు కొనకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు మున్నారు యాదయ్య కుటుంబాన్ని ఈ సందర్భంగా షర్మిల పరామర్శించారు. ఈ రైతు మరణానికి ప్రభుత్వమే కారణమని.. .ఓ వైపు రైతులను చంపుకుంటూ,మరోవైపు ధర్నాలు చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టాలని… వరి వేసుకోవడం రైతుల హక్కు అని స్పష్టం చేశారు.
రైతులు వరి వేసుకోండని.. ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే వడ్లు కొనేలా చేస్తామని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయే వరకు రైతుల కోసం కొట్లాడుతానని.. వరి వద్దనే ముఖ్యమంత్రి మనకొద్దంటూ నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. ఇప్పటికైనా కేసీఆర్ తన తీరు మార్చుకోకపోతే పతనం తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని షర్మిల అన్నారు.
