Site icon NTV Telugu

Mulugu: ములుగు జిల్లాలోని ఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణ.. కారణం ఇదే..

Mulugu

Mulugu

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో ఐలాపూర్ షడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయితీకి చెందిన పలువురు ప్రజలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ, కుల సర్వేను బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా.. తమ గ్రామానికి ఇంత వరకు తారు రోడ్డు నిర్మించక పోవడం దారుణమన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. గిరివికాస పథకం ద్వారా బోర్లు దింపి 7 సంవత్సరాలు గడుస్తున్నా.. ఆ బోర్లాకు మూడు తీగల కరెంట్ కరవైందని వాపోయారు. తమ గ్రామానికి సరైన మౌలిక సౌకర్యాలు కల్పించే వరకు ఈ కుల గణన సర్వేని జరగనివ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

READ MORE: Sajjanar: ఒక అవ‌కాశం ఇచ్చి చూడండి సార్.. కీరవాణికి సజ్జనార్ రిక్వెస్ట్!

కాగా.. నిర్మల్ జిల్లాలోని దిలావర్​పూర్, గుండంపెల్లి గ్రామాల్లోని ప్రజలు కూడా ఈ సర్వేను ఇటీవల బహిష్కరించారు. తమ గ్రామాలైన దిలావర్​పూర్-గుండంపెల్లి మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వారు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన సర్వే ప్రారంభమవ్వడంతో దానిని నిర్వహించేందుకు గ్రామాల్లోని ప్రజల వద్దకు ఎన్యుమరేటర్లు వెళ్లగా, ప్రజలు తిరస్కరించడం తీవ్రమైన అంశంగా మారింది. ప్రభుత్వం తమ గ్రామాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తి వేసేందుకు సహకరించడం లేదని గ్రామస్థులు వాపోయారు. అధికారులకు తాము వివరాలు చెప్పమని, తమ ఊరి నుంచి వెళ్లిపోవాలని పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీని తరలించే వరకు సమగ్ర కుల సర్వేకు సహకరించేది లేదని గ్రామస్థులు తీర్మానం చేసి అక్కడి అధికారులకు అందజేశారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.

Exit mobile version