Road Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే మీద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగిది. పల్టీలు కొట్టి కారు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారు నుజ్జునుజ్జయింది. ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మితిమీరిన వేగమా? మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Shatrughan Sinha: కూతురు పెళ్లైన వారానికే ఆసుపత్రి పాలైన స్టార్ హీరో!
పీవీఎన్ఆర్ హైవేపై తెల్లవారు 4 గంటలకు రోడ్డు ప్రమాదంపై మాకు సమాచారం అందిందని పీవీఎన్ఆర్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఇంచార్జి శ్రీనివాస్ తెలిపారు. వెంటనే మా టీమ్స్ ఘటన స్థలానికి వచ్చామన్నారు. పీవీఎన్ఆర్ హైవేపై ఆరాంఘర్ చౌరస్తా మలుపు వద్ద పిల్లర్ నంబర్ 296 డివైడర్ ఢీకొట్టి థార్ జీప్ పల్టీలు కొట్టిందని వెల్లడించారు. క్రేన్ సహాయంతో రోడ్డుకి అడ్డంగా ఉన్న థార్ కారును తొలగించారు. గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రమాదం సమయంలో కారులో మొత్తం నలుగురు ఉన్నట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు. పీవీఎన్ఆర్ హైవేపై స్పీడ్ కంట్రోల్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.