లారీని ఢీకొన్న కారు.. కారులో చెలరేగిన మంటలు

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌ నగరంలోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని శంషాబాద్ నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్‌ను బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఈసీఐఎల్‌కు దమ్మాయిగూడకు చెందిన మయూర్‌గా పోలీసులు గుర్తించారు.

అనంతరం స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో లారీ కూడా పాక్షికంగా దగ్ధమైంది. కాగా కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.