CM Revanth Reddy : గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, రాబోయే రోజుల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై క్షేత్రస్థాయి వ్యూహాన్ని ఖరారు చేశారు. ముఖ్యంగా ‘ఎస్ఐఆర్’ (SIR) ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల సామాన్యులు, పేదలు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయో నాయకులు ముందుగానే గుర్తించడం మంచి పరిణామమని సీఎం పేర్కొన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు , వలస కార్మికులకు పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో చాలా మంది ఉపాధి కోసం వలసలు పోయారని, అలాగే మహిళలకు కూడా దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఈ పరిస్థితుల కారణంగా దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు తొలగిపోయే (డిలీట్ అయ్యే) అవకాశం ఉందని, కాబట్టి వలసలు పోయిన వారి ఓట్లు పోకుండా చాలా జాగ్రత్త పడాలని సూచించారు. ఎస్ఐఆర్ వల్ల తలెత్తే ఇరుకులను అధిగమించడానికి, సమస్యల పరిష్కారంపైన నాయకులంతా సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు.
గతంలో బూత్ ఎన్రోలర్ల సహాయంతో కేవలం 90 రోజుల్లోనే 45 లక్షల డిజిటల్ మెంబర్షిప్ చేయించామని, ఎక్కువ సభ్యత్వం నమోదు చేయించిన వారికి రాహుల్ గాంధీ చేతుల మీదుగా సన్మానం కూడా చేయించామని సీఎం గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించిన ఎన్రోలర్ల సేవలను ఇప్పుడు ఎస్ఐఆర్ విషయంలో కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. డిజిటల్ మెంబర్షిప్ కోసం గతంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంఛార్జ్ను నియమించి పర్యవేక్షించినట్లే.. ఇప్పుడు ఎస్ఐఆర్ కోసం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 17 లోక్సభ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇంఛార్జ్లను నియమించాలని ఆదేశించారు. అసెంబ్లీ ఇంఛార్జ్లు తప్పనిసరిగా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి పని చేయాలని, వారు కరెక్ట్గా రంగంలో ఉంటే ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా కాపాడుకోవచ్చని భరోసా ఇచ్చారు.
పార్టీ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సిందేనని, ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు నాతో సహా ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పారు. ఇంఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒక రోజును పూర్తిగా పార్టీ కార్యక్రమాల కోసమే కేటాయించాలని, స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను కలవాలని ఆదేశించారు. నాయకులు క్షేత్రస్థాయికి వెళ్తేనే కార్యకర్తలు కూడా బూత్ స్థాయికి వెళ్తారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తానని, నెలలో మూడు రోజులు కేవలం వారి కోసమే సమయం ఇస్తానని ప్రకటించారు.
ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశామని, ప్రస్తుతం పార్టీ తరఫున వేలాది మంది సర్పంచ్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు బలంగా ఉన్నారని సీఎం గుర్తుచేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ నగర పరిధిలో ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలన్నారు. హైదరాబాద్ నగరం పరిధిలోని 15 నియోజకవర్గాలలో ఎస్ఐఆర్ పైన అసెంబ్లీల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, అలాగే మహిళా కాంగ్రెస్ తరఫున క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. పార్టీ సీనియర్లు, మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకుంటూ.. నాయకులంతా పూర్తి సమన్వయంతో ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
