CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు

  • జగ్గారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం
  • 30 ఏళ్లుగా ఆప్తమిత్రుడంటూ కీలక వ్యాఖ్యలు
  • ‘వెయ్యి కోట్లు ఇచ్చినా ఇలాంటి నాయకుడు దొరకడు’
  • పోటీ చేయనంటే ఇంట్లో పెట్టి తాళం వేయాలన్న సీఎం
Cm Revanth Reddy

Cm Revanth Reddy

సంగారెడ్డి వేదికగా జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. జగ్గారెడ్డి తనకు 30 ఏళ్లుగా ఆప్తమిత్రుడని, ఆయనను కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత సంగారెడ్డి ప్రజలపైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నంబర్ వన్ నాయకులలో జగ్గారెడ్డి ఒకరని, వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన లాంటి ప్రజా నాయకుడు దొరకడని వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో జగ్గారెడ్డి ఎప్పుడూ క్రియాశీలంగా ఉండాలని, ఒక సోదరుడిగా ఆయనకు నిరంతరం అండగా ఉంటానని సభాముఖంగా హామీ ఇచ్చారు.

‘పోటీ చేయనంటే ఊరుకోం.. ఇంట్లో పెట్టి తాళం వేయండి!’

రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించడంపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే స్పందించారు. “జగ్గారెడ్డి పోటీ చేయనంటే సరిపోదు.. ఆయన రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశాన్ని స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు” అని స్పష్టం చేశారు. ఇంకొకసారి పోటీ చేయనని జగ్గారెడ్డి అంటే, సంగారెడ్డి ప్రజలు ఆయనను వారం రోజుల పాటు ఇంట్లో పెట్టి తాళం వేయాలని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు.

సంగారెడ్డి ప్రజలకు సీఎం పిలుపు

జగ్గారెడ్డి సేవలు సంగారెడ్డి ప్రాంతానికే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని రేవంత్ రెడ్డి చెప్పారు. క్లిష్ట సమయంలో పార్టీ కోసం, ప్రజల కోసం నిలబడే నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపైనే ఉందని పిలుపునిచ్చారు. ప్రసంగం ముగింపులో జగ్గారెడ్డికి నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని సీఎం కోరారు.